న్యూఢిల్లీ: రాజస్థాన్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్ ఈ నెల 11న కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ కొట్టిపారేసింది. సచిన్ పైలట్ ఏ పార్టీ పెట్టడంలేదని, అదంతా అబద్ధమని, ఒట్టి పుకారు అని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు.
తాను ఈ విషయంపై సచిన్ పైలట్తో ఇప్పటికే రెండు మూడు సార్లు మాట్లాడానని, అదంతా అబద్ధపు ప్రచారమని ఆయన చెప్పారని కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. ఓ నాయకుడు సొంతంగా పార్టీ పెట్టుకోవడం అనేది రాజస్థాన్ కాంగ్రెస్లో జరుగదని ఆయన వ్యాఖ్యానించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తాము కలిసి కట్టుగా ఎన్నికల్లో పోరాడుతామని చెప్పారు. రాజస్థాన్ కాంగ్రెస్లో ఐక్యత ఉందని, పుకార్లను నమ్మివద్దని ఆయన అన్నారు.
కాగా, రాజస్థాన్లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్కు, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్కు ఏమాత్రం పొసగడం లేదు. ఇద్దరి మధ్య తరచూ విభేదాలు పొడసూపుతున్నాయి. ఈ నేపథ్యంలో సచిన్ పైలట్ కొత్త పార్టీ పెడుతున్నారనే ప్రచారం ఊపందుకుంది. తన తండ్రి రాజేశ్ పైలట్ వర్ధంతి అయిన జూన్ 11న సచిన్ పైలట్ తన పార్టీ పేరును ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతున్నది.
#WATCH | Delhi | Congress general secretary & in-charge of Organisation, KC Venugopal reacts to speculations of Sachin Pilot likely to announce a new party on June 11; says, “…I don’t think so. These are all rumours…To my knowledge, there is no such movement in Rajasthan. I… pic.twitter.com/pYepxKHaxz
— ANI (@ANI) June 9, 2023