కాంగ్రెస్ ఎప్పటికీ బీజేపీకి ప్రత్యామ్నాయం కాదని కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ అన్నారు. బీజేపీని ఓడించడానికి లౌకికవాద ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. తాము సెక్యులర్ అంటూ కాంగ్రెస్ పదే పదే చెబుతున్నా, మత సంతుష్టీకరణ రాజకీయాలను అందిపుచ్చుకుంటోందని తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ ఆచరిస్తున్న ఆర్థిక విధానాలనే కాంగ్రెస్ కూడా ఆచరిస్తుందని, అలాంటి సమయంలో కాంగ్రెస్ ఎలా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని ప్రశ్నించారు.
బీజేపీని మరోసారి భరించే శక్తి దేశ ప్రజలకు లేదని, మతతత్వ విధానాలకు, హిందుత్వ శక్తులకు వ్యతిరేకంగా ఓ ప్రత్యామ్నాయ శక్తి ఆవిర్భవించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో సెక్యులర్ అన్న వాదాన్ని సజీవంగా ఉంచాలంటే మతతత్వంపై రాజీలేని వైఖరిని అవలంబించాలని, కానీ కాంగ్రెస్ ఈ పనిని ఏమాత్రం చేయడం లేదని ఆయన విమర్శించారు. రాను రాను కాంగ్రెస్ సాఫ్ట్ హిందుత్వను అనుసరిస్తున్నట్లు కనిపిస్తోందని, జైపూర్ వేదికగా రాహుల్ మాటలు ఇవే అర్థాన్నిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఈ కారణంగానే కాంగ్రెస్పై ప్రజలకు నమ్మకం పోతోందని, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇది నిరూపితమైందని పినరయ్ విజయన్ అన్నారు.