న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గమైన ఉత్తరప్రదేశ్లోని కాశి (వారణాసి) అభివృద్ధిపై కాంగ్రెస్ పార్టీ పలు ప్రశ్నలు సంధించింది. గురువారం వారణాసిలో పర్యటించిన ప్రధాని మోదీ, అంతర్జాతీయ సహకార మరియు సమావేశ కేంద్రం – ‘రుద్రాక్ష’తోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కాశిలో అభివృద్ధి నది పరవళ్లు తొక్కుతున్నదని ఈ సందర్భంగా మోదీ అన్నారు. కాగా, కాంగ్రెస్ సీనియర్ నేత రణదీప్ సింగ్ సుర్జేవాలా దీనిపై ట్విట్టర్లో స్పందించారు. ప్రధాని మోదీకి పలు ప్రశ్నలు సంధించారు. గంగానదిని శుభ్రపరిచారా?, కాశీ క్యోటో అయ్యిందా?, కరోనా సమయంలో కాశీని ఎందుకు చెడ్డ స్థితిలో ఉంచారు?, కాశీలో ఏదైనా పరిశ్రమ ఉందా?, సామాన్యులు తక్కువ ఖర్చుతో వివాహాలు జరిపేందుకు ఉపయోగించే రుద్రాక్ష కేంద్రాన్ని ప్రైవేట్ కంపెనీకి ఇవ్వడం ద్వారా మీరు ఎవరికి సేవ చేస్తున్నారు?, బాబా విశ్వనాథ్ కారిడార్ పేరుతో పౌరాణిక కాలం నాటి దేవాలయాలు ఎందుకు కూల్చుతున్నారు?, బనారస్ గుర్తింపు అయిన గంగా నది నెలవంక ఆకారం ఎందుకు చెడిపోయింది? అని ప్రశ్నించారు.