ఢిల్లీలోని జాహంగీర్పూరీలో ఇంత పెద్ద ఘటనలు జరుగుతున్నా… ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఎందుకు మౌనంగా వున్నారని కాంగ్రెస్ నిలదీసింది. ఇంత జరుగుతున్నా… మౌనంగా ఉండటం శోచనీయమని మాకెన్ దుయ్యబట్టారు. మరోవైపు జాహంగీర్పూరీ బాధిత కుటుంబాలను అజయ్ మాకెన్ నేతృత్వంలోని కాంగ్రెస్ బృందం పరామర్శించింది. 16 మంది నేతలు ఈ బృందంలో వున్నారు. ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేతలు చేయడం చట్ట విరుద్ధమని మాకెన్ మండిపడ్డారు. అయితే.. ఈ వ్యవహారాన్ని మతపరమైన కోణంలో చూడొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇక… కూల్చివేతల ప్రాంతాన్ని, బాధిత కుటుంబాలను పరామర్శించి, చివరకు పార్టీ అధ్యక్షురాలు సోనియాకు ఓ నివేదిక అందిస్తామని మాకెన్ ప్రకటించారు.
జాహంగీర్పూర్ వ్యవహారంపై కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కూడా మండిపడ్డారు. బుల్డోజర్ అంటేనే ఏకపక్ష కూల్చివేతలంటూ అభివర్ణించారు. ఏకపక్షమైన ఆర్డర్లతో చట్టాన్ని ఉల్లంఘిస్తూ.. ప్రవర్తిస్తే నరకానికే వెళ్తామని చిదంబరం హెచ్చరించారు.