న్యూఢిల్లీ : కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బుధవారం దశదిశా లేని బడ్జెట్ను ప్రవేశపెట్టారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే పెదవివిరిచారు. రాబోయే మూడు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ బడ్జెట్ను రూపొందించిందని దుయ్యబట్టారు. పేదల కష్టాలు తొలగించేందుకు, ధరలను నియంత్రించేందుకు బడ్జెట్లో ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించారు.
నిర్మలమ్మ బడ్జెట్లో యువతకు ఉద్యోగాల కల్పన, ప్రభుత్వ ఖాళీల భర్తీ, ఉపాధి హామీ పనుల ఊసే లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రానున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోణంలోనే బడ్జెట్కు తుదిమెరుగులు దిద్దారని వ్యాఖ్యానించారు. ఇక నిర్మలా సీతారామన్ బడ్జెట్పై విపక్షాలు భగ్గుమన్నాయి. అసలు ఆదాయమే లేదు, పన్ను మినహాయింపుల వల్ల ప్రజలు ఎలా ప్రయోజనం పొందుతారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రశ్నించారు.
ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్యను ప్రభుత్వం పరిష్కరించడం లేదని విమర్శించారు. పేదలకు కేవలం హామీలు, మాటలే మిగిలాయని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ఆరోపించారు. బడా పారిశ్రామికవేత్తలకే లబ్ధి కలిగించేలా ఈ బడ్జెట్ ఉందని విమర్శించారు. మరోవైపు దేశంలోని మధ్య తరగతి ప్రజానీకానికి ఈ బడ్జెట్తో ఒరిగేదేమీ లేదని టీఎంసీ నేత శతృఘ్న సిన్హా ఎద్దేవా చేశారు.