నరేంద్ర మోదీ 8 ఏళ్ల పాలనా వైఫల్యాలపై కాంగ్రెస్ బుక్లెట్ ప్రచురిస్తోంది. మోదీ పాలనలో వైఫల్యాలను ప్రచురించి… ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ బుక్ లెట్ పేరు 8 ఏళ్లు.. 8 మోసాలు అంటూ కాంగ్రెస్ ఈ బుక్లెట్కు పేరు పెట్టింది.
కాంగ్రెస్ నేతలు రణదీప్ సూర్జేవాలా, అజయ్ మాకెన్ గురువారం విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. మోదీ పదే పదే అచ్ఛేదిన్ అంటూ ప్రచారం చేస్తున్నారని, అసలు ఈ అచ్ఛేదిన్ ఎవరికి వచ్చాయో చెప్పాలని ఆ నేతలు డిమాండ్ చేశారు. బ్యాంకులను మోసం చేసిన వారికే అచ్ఛేదిన్ వచ్చిందని, ఓటు వేసిన ప్రజలకు ఏమీ రాలేదని అజయ్ మాకెన్ ఎద్దేవా చేశారు.
మోదీ పాలన అంతా మోసమేనని, ఆయన ప్రజలకంటూ చేసిందేమీ లేదని కాంగ్రెస్ నేతలు విరుచుకుపడ్డారు. నిత్యావసర ధరలతో పాటు అన్ని ధరలను పెంచేసి, ప్రజలను ఇబ్బందులు పెట్టిందని మండిపడ్డారు. ఈ 8 ఏళ్లలో పెట్రో, డీజిల్పై ఎక్సైజ్ సుంకం విధించి, 27 లక్షల కోట్ల రూపాయలను ఆర్జించుకుందని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాల విషయంలోనూ మోదీ ప్రభుత్వం ప్రజలను మోసమే చేసిందని సూర్జేవాలా, మాకెన్ మండిపడ్డారు.