న్యూఢిల్లీ : స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ఆజాదీ కీ అమృత్ మహోత్సవ్ కార్యక్రమ నిర్వహణలో భాగంగా ఏర్పాటు చేసిన బ్యానర్లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఫోటోను విస్మరించడం పట్ల మోదీ సర్కార్పై కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చి (ఐసీహెచ్ఆర్) వెబ్సైట్లో ప్రదర్శించిన ఈ బ్యానర్పై మహాత్మ గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్సింగ్, వినాయక్ దామోదర్ సావర్కర్ సహా ఇతర నేతల ఫోటోలు ఉండగా నెహ్రూ ఫోటో ప్రదర్శించలేదు.
భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తిరుగులేని వాణిని వినిపించిన నెహ్రూ ఫోటో విస్మరించి స్వాతంత్ర్య వేడుకలు జరుపుకోవడం సిగ్గుచేటని, ఇవి చిల్లర చేష్టలని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ శనివారం ట్వీట్ చేశారు. ఐసీహెచ్ఆర్ మరోసారి ఇలాంటి చర్యకు పాల్పడిందని, ఇది పాలకులకు అలవాటుగా మారిందని అన్నారు. చత్తీస్ఘడ్ మంత్రి టీఎస్ సింగ్ దేవ్ కూడా నెహ్రూ పోటోను విస్మరించడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు.