బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల (Karnataka elections) పోలింగ్ ముగియడంతో ఆ రాష్ట్రంలో హంగ్ ఏర్పడవచ్చని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ సీట్లు బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీకి రాకపోవచ్చని అంచనా వేశాయి. దీంతో మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి నేతృత్వంలోని జనతాదళ్ సెక్యులర్ (జేడీ(ఎస్)) కింగ్మేకర్ కావచ్చని పేర్కొన్నాయి. శనివారం కౌంటింగ్ జరిపి ఫలితాలు వెల్లడించనున్న నేపథ్యంలో జేడీ(ఎస్) కీలక ప్రకటన చేసింది. కాంగ్రెస్, బీజేపీ నుంచి తమకు ఆఫర్లు వచ్చాయని తెలిపింది. ఎవరికి మద్దతివ్వాలో అన్నది కూడా నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
కాగా, సరైన సమయంలో తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని జేడీ(ఎస్) నేత తన్వీర్ అహ్మద్ మీడియాతో అన్నారు. కుమారస్వామి బుధవారం రాత్రి సింగపూర్ వెళ్లినట్లు తెలిపారు. అయినప్పటికీ ఏ పార్టీతో భాగస్వామ్యం కావాలో అన్నది ఆయన ఇప్పటికే నిర్ణయించుకున్నట్లు చెప్పారు. జాతీయ పార్టీలైన బీజేపీ లేదా కాంగ్రెస్ తమ మద్దతు లేనిదే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేవని అన్నారు. కర్ణాటక, కన్నడ ప్రజల కోసం పని చేసే పార్టీకే తమ మద్దతు ఉంటుందన్నారు. అలాగే తమ పార్టీ ఖచ్చితంగా ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉంటుందని స్పష్టం చేశారు.
మరోవైపు జేడీ(ఎస్)ను తాము సంప్రదించినట్లు వచ్చిన వార్తలను బీజేపీ ఖండించింది. తమకు మెజార్టీ వస్తుందని, తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేసింది.