బెంగళూర్ : వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్నాటకలో పాలక బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నగర పాలక సంస్ధల ఎన్నికల ఓట్ల లెక్కింపులో వెల్లడవుతున్న ఫలితాలు కాషాయ పార్టీకి నిరాశ కలిగిస్తున్నాయి. కాంగ్రెస్ పలు స్ధానాలను దక్కించుకుంటుండగా బీజేపీ వెనుకపడింది.
జేడీ(ఎస్) మూడోస్ధానంతో సరిపెట్టుకోనుంది. నగరపాలక సంస్ధల ఎన్నికల్లో ఇప్పటివరకూ వెల్లడైన ఫలితాల్లో కాంగ్రెస్ 501 స్ధానాలను గెలుచుకోగా బీజేపీ 431 స్ధానాల్లో విజయం సాధించింది. 45 స్ధానాల్లో గెలుపొందిన జేడీ(ఎస్) మూడో స్ధానానికి పరిమితమైంది. కర్నాటకలో 58 నగరపాలక సంస్ధలు, పలు నగరపాలక సంస్ధల్లో 9 వార్డులకు ఉప ఎన్నికలు, 57 గ్రామ పంచాయితీలకు డిసెంబర్ 27న పోలింగ్ జరిగింది.
కొవిడ్-19 వ్యాప్తితో మూడేండ్ల జాప్యం అనంతరం ఎన్నికలు జరిగాయి. కర్నాటక సీఎంగా బసవరాజ్ బొమ్మై పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఆయన నాయకత్వానికి ఎన్నికల ఫలితాలు గీటురాయిగా భావిస్తున్నారు. మరోవైపు వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో తాజా ఫలితాలు కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్తేజం నింపాయి.