న్యూఢిల్లీ, మార్చి 24: ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఇది భారత ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని పేర్కొన్నది. రాహుల్ లోక్సభ సభ్యత్వం రద్దుపై రాజకీయంగా, న్యాయపరంగా పోరాడుతామని స్పష్టం చేసింది. అనర్హత వేటు చర్య రాజకీయ ప్రతీకారంలో భాగమే తప్ప మరేమీ కాదని కేంద్రం తీరుపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ దేశంలోని ప్రస్తుత పరిస్థితులపై వాస్తవాలు మాట్లాడుతున్నందుకు రాహుల్పై అనర్హత వేటువేయడానికి బీజేపీ అన్నివిధాలుగా ప్రయత్నాలు చేసిందని అన్నారు. ‘వాస్తవాలు మాట్లాడుతున్నందుకు, రాజ్యాంగం, ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నందుకు రాహుల్ను లోక్సభ సభ్యత్వం నుంచి తప్పించారు’ అని పేర్కొన్నారు. రాహుల్ ఓబీసీ కమ్యూనిటీని దొంగలుగా పోల్చారని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన విమర్శలపై ఖర్గే స్పందిస్తూ.. బీసీలకు వ్యతిరేకంగా రాహుల్ వ్యాఖ్యలు చేశారని బీజేపీ నేతలు కుట్రపూరిత ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ను లోక్సభ నుంచి బయటకు పంపి తమ సమస్య తీరిందని బీజేపీ అనుకొంటున్నదని, అయితే అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలనే తమ డిమాండ్ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ కీలక నేతల భేటీ
రాహుల్పై అనర్హత వేటు నేపథ్యంలో తదుపరి వ్యూహంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్వర్యంలో పార్టీ సీనియర్ నేతలు శుక్రవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. దేశవ్యాప్తంగా ‘జన్-ఆందోళన్’ పేరుతో పెద్దయెత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకొన్నారు. సోమవారం నుంచి అన్ని రాష్ర్టాల కాంగ్రెస్ యూనిట్లు, అనుబంధ సంఘాలు దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడుతాయని జైరాం రమేశ్ తెలిపారు. రాహుల్ గాంధీపై కావాలనే అనర్హత వేటు వేశారనే అంశాన్ని ప్రజలకు చెబుతామని పేర్కొన్నారు. రాహుల్ నోరు కట్టేసేందుకు కేంద్రంలోని బీజేపీ మెరుపు వేగంతో కదిలిందని విమర్శించారు. రాహుల్కు మద్దతుగా ప్రతిపక్ష నేతల ప్రకటనలను స్వాగతిస్తున్నామని, విపక్షాల ఐక్యతను క్రమపద్ధతిలో ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నదని అన్నారు.
అదానీ వ్యవహారంపై జేపీసీ వేయమంటే..
తమను బెదిరించి నోరు మూయించలేరని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ పేర్కొన్నారు. రాజకీయంగా, న్యాయపరంగా పోరాడుతామని తెలిపారు. ప్రతిపక్షాలన్నీ డిమాండ్ చేస్తున్నట్టుగా ప్రధాని మోదీకి సంబంధం ఉన్న అదానీ మెగా కుంభకోణంపై జేపీసీ వేయకుండా, రాహుల్పై అనర్హత వేటు వేసిందని ఆ పార్టీ నేతలు అధిర్ రంజన్ చౌదరి, కేసీ వేణుగోపాల్, శశిథరూర్, అభిషేక్ మను సింఘ్వి విమర్శించారు. రాహుల్ గొంతు నొక్కేందుకు బీజేపీ కొత్త టెక్నిక్తో ప్రయత్నిస్తున్నదన్నారు.