న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కేంద్రంలోని దురహంకార సర్కార్కు వ్యతిరేకంగా ఓటు వేశారని కాంగ్రెస్ నేత దీపీందర్ హుడా అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని యూపీలో మార్పు తధ్యమని, కాంగ్రెస్ యూపీలో కీలక పాత్ర పోషిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. ఇక యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఎగ్జిట్ పోల్స్పై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పందించారు.
అసెంబ్లీ ఎన్నికల పోరులో తాము శక్తివంచన లేకుండా పోరాడామని, తాము ఎన్నికల ఫలితాల కోసం వేచిచూస్తున్నామని ఆమె వ్యాఖ్యానించారు. మహిళా సాధికారత ప్రధానంగా ప్రియాంక గాంధీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచార వ్యూహాన్ని ముందుండి నడిపించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నయా జోష్ నెలకొంది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 40 శాతం టికెట్లను మహిళా అభ్యర్ధులకు కేటాయిస్తామని ప్రకటించడంతో 403 స్ధానాలకు గాను 159 మంది మహిళా అభ్యర్ధులను కాంగ్రెస్ బరిలో దింపింది.
మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లక్నోలో కాంగ్రెస్ పార్టీ తమ స్లోగన్ లడ్కీ హూ..లడ్శక్తీ హూ..పేరిట భారీ ప్రదర్శన నిర్వహించింది. తమ పార్టీ తరపున బరిలో నిలిచిన 159 మంది మహిళా అభ్యర్ధులకు ఇది వేడుక వంటిదని..తామంతా ఎన్నికల్లో పోరాడామని వారితో కలిసి మహిళా దినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ పేర్కొన్నారు.