న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం సోమవారం జరిగిన ఎన్నికలు ముగిశాయి. సుమారు 96 శాతం ఓటింగ్ నమోదైంది. కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లిఖార్జున ఖర్గే, శశిథరూర్ పోటీ పడిన ఈ ఎన్నికల్లో 9,500 మందికిపైగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) సభ్యులు ఓటు వేసినట్లు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ తెలిపారు. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, పీ చిదంబరం సహా 87 మంది పార్టీ నేతలు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఓటు వేసినట్లు చెప్పారు. ఈ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగలేదని అన్నారు.
ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి ఇప్పటి వరకు మూడు బ్యాలెట్ బాక్సులు చేరాయని, అన్ని బాక్సులు చేరిన తర్వాత ఈ నెల 19న ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటిస్తామని మధుసూదన్ వెల్లడించారు. బహిరంగ పద్ధతిలో జరిగిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల నుంచి ఇతర పార్టీలు పాఠాలు నేర్చుకోవచ్చని ఆయన సూచించారు.
కాగా, గాంధీయేతర నేతను పార్టీ అధినేతగా ఎన్నుకునేందుకు 24 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరిగాయి. 137 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగడం ఇది ఆరోసారి. పోటీ పడిన మల్లిఖార్జున ఖర్గే, శశిథరూర్లో ఎవరు కాంగ్రెస్ పగ్గాలు చేపడతారన్నది బుధవారం తేలనుంది.