న్యూఢిల్లీ: రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటు వేసిన హర్యానా ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉన్న ఆయనను ఆ హోదాతో పాటు పార్టీలోని అన్ని పదవుల నుంచి తొలగించింది. హర్యానా రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ ఓటమిని పార్టీ సీరియస్గా తీసుకుంది. బీజేపీ, జేజేపీ మద్దతిచ్చిన స్వతంత్ర అభ్యర్థి కార్తికేయ శర్మ స్వల్ప ఓట్ల మెజార్టీతో గెలిచారు. దీంతో ఆయనకు అనుకూలంగా క్రాస్ ఓటు వేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్కు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ విధానాలు నచ్చిన ఆయన ఇలా చేశారని, ఆయన అంతర్గత ఆత్మ స్వరం మేరకు నిర్ణయం తీసుకున్నారని అన్నారు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ తీరుపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. క్రమశిక్షణా రాహిత్యంతో క్రాస్ ఓటింగ్కు పాల్పడినట్లు ఆరోపించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనను బహిష్కరించింది. ఈ మేరకు శనివారం నోటీస్ జారీ చేసింది. ‘కాంగ్రెస్ అధికారిక అభ్యర్థికి ఓటు వేయనందున బిష్ణోయ్ తీవ్రమైన క్రమశిక్షణా రాహిత్యాన్ని పార్టీ తీవ్రంగా పరిగణించింది. బిష్ణోయ్పై కఠిన చర్యలు తీసుకున్నాం’ అని హర్యానా కాంగ్రెస్ ఇంచార్జ్, హర్యానా రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ అధీకృత ఏజెంట్ అయిన వివేక్ బన్సాల్ తెలిపారు.