న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టయ్యి జ్యుడీషియల్ కస్టడీలో సీబీఐ, ఈడీ విచారణ ఎదుర్కొంటున్న ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా భార్య సీమా సిసోడియా ఆరోగ్యం విషమించింది. దాంతో కుటుంబసభ్యులు ఆమెను లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ వెల్లడించింది.
సిసోడియా తన భార్యను కలవడం కోసం ఇంటికి రావడానికి కొద్దిసేపటి ముందే ఆమె అనారోగ్యం మరింత ముదిరి ఆస్పత్రిపాలయ్యారని ఆప్ పేర్కొంది. భార్యకు అనారోగ్యం రీత్యా ఆమెను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని మనీశ్ సిసోడియా ఇటీవల ఢిల్లీ కోర్టును అభ్యర్థించారు. దాంతో ఇవాళ ఉదయం 10 గంటల నుంచి 5 గంటల నడుమ సిసోడియా తన భార్యను కలిసేందుకు కోర్టు అనుమతించింది.
అయితే, ఇవాళ ఉదయం ఆయన తన భార్యను చూడటానికి వెళ్లడం కంటే ముందే ఆయన సీమా సిసోడియా ఆరోగ్యం విషమించింది. దాంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. కాగా మనీశ్ సిసోడియా భార్య సీమా సిసోడియా గత కొన్నాళ్లుగా మల్టిపుల్ స్క్లీరోసిస్ వ్యాధి (నరాలు గట్టిపడే వ్యాధి) తో బాధపడుతున్నారు.