న్యూఢిల్లీ: దేశంలోని జైళ్ల దుస్థితిపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. కార్పొరేట్ల భాగస్వామ్యంతో ప్రైవేట్ జైళ్లను నిర్మించాలని ప్రతిపాదించింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద కార్పొరేట్ సంస్థలు ప్రైవేట్ జైళ్లను నిర్మించవచ్చని పేర్కొన్నది. ఎల్గార్ పరిషత్ కేసులో శిక్ష అనుభవిస్తున్న సామాజిక కార్యకర్త గౌతమ్ నవ్లఖాకు జైలులో సరైన వైద్యం అందడం లేదని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. ఆయనకు పెద్దపేగు క్యాన్సర్ ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. జైళ్లలో రద్దీ ఎక్కువగా ఉందని, కేవలం ఆయుర్వేద వైద్యులు మాత్రమే అందుబాటులో ఉన్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో కోర్టు ప్రైవేట్ జైళ్ల నిర్మాణంపై కీలక సూచనలు చేసింది. యూరప్లో కార్పొరేట్ సంస్థలు సీఎస్ఆర్ కింద ప్రైవేట్ జైళ్లను నిర్మిస్తున్నాయని తెలిపింది. నవ్లఖాను మెరుగైన వైద్యం కోసం ముంబైలోని జస్లోక్ దవాఖానకు తరలించాలని ఆదేశించింది.