Odisha Rail Tragedy | ఒడిశా రైలు ప్రమాద బాధితుల్లో టికెట్ లేని ప్రయాణికులకు కూడా పరిహారం చెల్లిస్తామని రైల్వేశాఖ వెల్లడించింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఆ పరిహారం అందిస్తామని పేర్కొంది. టికెట్ ఉందా.. లేదా అనే మీమాంశతో సంబంధం లేకుండా బాధితులందరికీ పరిహారం అందుతుందని రైల్వేశాఖ అధికార ప్రతినిధి అమితాబ్ శర్మ తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ.50 వేల సాయం అందిస్తామని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇప్పటికి 285 కేసుల్లో రూ.6.06 కోట్ల పరిహారం అందజేశామని రైల్వేశాఖ తెలిపింది. మృతుల్లో 31 మంది కుటుంబాలకు, తీవ్రంగా గాయపడిన 83 మందికి, 259 మందిస్వల్ప గాయాలైన వారికి పరిహారం అందజేశామని వివరించింది. సోరో, ఖరగ్ పూర్, బాలేశ్వర్, ఖంటపాడా, భద్రక్, భువనేశ్వర్, కటక్ ప్రాంతాల్లో పరిహారం అందిస్తున్నామని పేర్కొంది. ఇంకా 200 మంది బాధితులను గుర్తించాల్సి ఉందని, ఆ వివరాలు వెబ్సైట్లో వెల్లడించినట్లు తెలిపింది.
ఇదిలా ఉంటే దవాఖానలో చికిత్స పొందుతున్న ప్రతి బాధితుడికి, వారి కుటుంబీకులను గుర్తించడానికి ఒక సహాయకుడు ఉన్నాడని రైల్వే బోర్డు సభ్యుడు జయవర్మ సిన్హా తెలిపారు. బాధితుల కోసం హెల్ప్ లైన్ నంబర్ కూడా అందుబాటులో ఉందని చెప్పారు. బాధితుల్లో సాధ్యమైనంత వరకు ఎక్కువ మందికి వారి కుటుంబ సభ్యులతో కలిపేందుకు రైల్వే అధికారులు ప్రయత్నిస్తున్నారని వివరించారు. మృతులు, క్షతగాత్రుల కోసం వచ్చే ప్రయాణ, ఇతర ఖర్చులు కూడా రైల్వేశాఖే భరిస్తుందని స్పష్టం చేశారు.