భారత్లో ఉక్రెయిన్ రాయబారి ఇగోర్ పొలిఖా వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. పరిపక్వత లేని మధ్యయుగ జ్ఞానాన్ని తన వద్దే ఉంచుకుంటే మంచిదంటూ ఒవైసీ మండిపడ్డారు. ‘గౌరవనీయులైన (ఎవరో అతను) తన సగం సగం మధ్యయుగ జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోకుంటేనే మంచిది. అది మొత్తం ఇస్లామోఫఓబియా కంపు కొడుతోంది. అంతేకాదు, ఇప్పుడు జరుగుతున్న దానికి, ఆయన చెప్పిన దానికి ఎటువంటి సంబంధం లేదు. ప్రధాని మోదీ అటెన్షన్ కోసం ‘మొఘల్స్’ను ఉపయోగించుకోవాలనే ఆలోచన ఆయనకు ఎలా వచ్చిందో ఏమో?’ అంటూ ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఉక్రెయిన్ రాయబారి పోలిఖా ఏమన్నారంటే…
క్రెయిన్లోని రష్యా దాడిలో మరణించిన నవీన్ మృతిపట్ల భారత్లోని ఉక్రెయిన్ రాయబారి పోలిఖా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. గతంలో రష్యా దళాలు కేవలం మిలటరీ స్థావరాలపైనే దాడులు చేసేవారని, ఇప్పుడు పౌరులపై కూడా దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. రాజ్పుత్లపై మొఘలులు చేసిన దాడిలా ఉందంటూ ఆయన అభివర్ణించారు. బాంబు దాడులు ఆపాలంటూ ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన నేతలను ప్రతిసారీ తాము అభ్యర్థిస్తూనే వున్నామని, అందులో ప్రధాని మోదీ కూడా ఉన్నారన్నారు. రష్యా దాడిలో భారతీయ విద్యార్థి నవీన్ మృతి చెందిన నేపథ్యంలో భారత ప్రభుత్వం ఉక్రెయిన్ రాయబారికి సమన్లు పంపింది. ఈ నేపథ్యంలో పోలిఖా పై వ్యాఖ్యలు చేశారు. ‘మొఘలులు రాజ్పుత్లపై చేసిన దాడి లాంటిదే ఈ దాడులు కూడా. బాంబు దాడులు, కాల్పుల మోతలు ఆపాలంటూ శక్తిమంతమైన నేతలందర్నీ అభ్యర్థించాం. అందులో మోదీ కూడా ఉన్నారు’ అంటూ ఇగోర్ పోలిఖా పేర్కొన్నారు.