లక్నో, సెప్టెంబర్ 19: ధరాఘాతం, నిరుద్యోగం, శాంతి భద్రతల వైఫల్యంపై ఉత్తరప్రదేశ్లో ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలో సోమవారం అసెంబ్లీ సమావేశాల ప్రారంభ రోజున నిరసన మార్చ్ చేపట్టింది. లక్నోలోని విక్రమాదిత్య మార్గ్ వద్ద పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. భారీగా పోలీసు బలగాలను మోహరించడంతో పాటు బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో ఎస్పీ ఎమ్మెల్యేలు, నేతలు అక్కడే బైఠాయించి ఆందోళనకు దిగారు. అసెంబ్లీ మాక్ సెషన్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ అధినేత అఖిలేశ్ మీడియాతో మాట్లాడుతూ యూపీలోని బీజేపీ ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైందని విమర్శించారు. భారత్ వంటి గ్రామీణ దేశంలో పాలు, పెరుగు, నెయ్యి వంటి పదార్థాలపై కూడా జీఎస్టీ విధిస్తారని ఎవరూ ఊహించలేదని, అది కేంద్రంలో పాలిస్తున్న బీజేపీకే చెల్లిందని మండిపడ్డారు. నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయని, ప్రజలకు చూపిన ఉద్యోగాల ‘కల’ను నెరవేర్చడంలో కమలం పార్టీ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు ఇవ్వడం అటుంచితే.. యువకులు, పేదలు, దళితుల ఉద్యోగాలు లాక్కుంటున్నారని.. రైల్వేలు, ఎయిర్పోర్టులను ప్రైవేటుపరం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజాసమస్యలను సభలో లేవనెత్తుతామని, అభద్రతాభావంలో ఉన్న యోగి సర్కార్ ఎస్పీని చూసి భయపడుతున్నదని అఖిలేశ్ అన్నారు.