బోర్లకు యోగీ సర్కార్ కరెంటు మీటర్లు
వారానికే రూ.8 వేల దాకా బిల్లులు
యూపీలోని రైతన్నల తీవ్ర ఆగ్రహం
పీక్కొచ్చి కరెంటాఫీసులో పారబోత
బిల్లు వసూళ్లకేనని ముందే చెప్పిన కేసీఆర్
కాదంటూ బుకాయించిన బండి బ్యాచ్
రాష్ట్ర బీజేపీ నేతల్లారా మీటర్ల విషయంలో ఎవరిది నిజం? ఎవరిది అబద్ధం?
మోదీ సర్కారు వ్యవసాయ బావులకు మీటర్లు పెడుతున్నదని నాడు సీఎం కేసీఆర్ చెప్తే..
అబ్బే మీటర్లు పెట్టాలని చెప్పనే లేదు.. అబద్ధమని బీజేపీ నేతలంతా సన్నాయి నొక్కులు నొక్కారు!
ఆంధ్రప్రదేశ్లో మీటర్లు పెడుతున్నారని ఫొటోలతో సహా ‘నమస్తే తెలంగాణ’ ప్రచురిస్తే ఉత్తుత్తిగనే పెడుతున్నాం..
ఎంత కరెంటు వాడకమవుతుందో తెలుసుకోవడానికేనని బొంకారు!
ఇప్పుడు బీజేపీ పాలిత డబుల్ ఇంజిన్ రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో సరిగ్గా మూడు వారాల క్రితం మీటర్లు పెట్టారు.. పెట్టిన పదిహేను రోజులకే బిల్లులు పంపటమూ మొదలుపెట్టారు. అదీ అలా ఇలా కాదు.. ఏకంగా రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు ఒక్కో రైతుకు కరెంటు బిల్లుల మోత మోగింది. అదికూడా వారానికో బిల్లు వస్తున్నది. ఇవేం బిల్లులు బాబోయ్ అని నెత్తీనోరూ బాదుకున్నా ఆ రైతులను పట్టించుకొన్న నాథుడే లేకుండా పోయాడు. గతంలో లాగా మేం వాడుకున్న కరెంటుకైతే బిల్లు కడతాం కానీ.. ఇవేం బిల్లులయ్యా బాబూ అని అడిగితే జవాబిచ్చేవారే లేరు. చివరకు విసుగుపుట్టిన 60 మంది రైతులు మీటర్లన్నీ ఊడబీక్కుని పట్టుకెళ్లి కరెంటు ఆఫీసులో కుప్ప పోసి నిరసన వ్యక్తంచేశారు. విద్యుత్తు సంస్కరణలతో వ్యవసాయ బావులకు మీటర్లు పెట్టటం నిజం.. వాటికి బిల్లులు వేయడమూ నిజం.. ఇదీ మోదీ సర్కారు నైజం.. ఇప్పుడేమంటారు రాష్ట్ర బీజేపీ నేతలు..?
దమ్ముంటే చూపించు నేనడుగుతున్నా..
మీటర్లు పెడతామని కేంద్రం ఎక్కడైనా చెప్పిందా? దమ్ముంటే చూపించు.. కేంద్రం ఎప్పుడైనా బోర్లకు మీటర్లు పెట్టాలని చెప్పినట్టుగా నిరూపిస్తే నేను ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పేందుకు సిద్ధం.. నిరూపించ కపోతే.. నువ్వు ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలి.
-బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు (ఫిబ్రవరి 12, 2022)
చెప్పే టైమెక్కడిది?
మూడు వారాల క్రితం బోరు బావులకు మీటర్లు బిగించారు. 15 రోజుల తర్వాత బిల్లుల్ని పంపించారు. ఇంత పెద్ద మొత్తంలో బిల్లు ఎందుకు వస్తున్నదో వివరించాలని అధికారులను పదేపదే అడిగాం. దీనికి సమాధానం చెప్పే సమయం వారికి లేకుండా పోయింది. దీంతో ఆ మీటర్లను తొలగించి ఆఫీసులో గుమ్మరించాం. సమస్యను పరిష్కరిస్తామని ఇప్పుడు అధికారులు చెప్తున్నారు.
-దేశ్ పాల్సింగ్, యూపీ రైతు
ముజఫర్నగర్, జూన్ 23: అది బీజేపీ పాలిత యూపీలోని ఉమార్పూర్ గ్రామం. బుధవారం ఉదయం దాదాపు 60 మంది అన్నదాతలు కరెంట్ ఆఫీసులోని అధికారుల టేబుళ్ల ముందు ఎలక్ట్రిసిటీ మీటర్లను తెచ్చి కుప్పలుగా పోశారు. ఉచిత విద్యుత్తు హామీపై మాటమార్చి తమను ఏమార్చిన యోగి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. ఇంతకీ ఏమైంది? వాళ్లెందుకిలా చేశారు?
హామీని తుంగలో తొక్కి..
రైతులకు ఉచిత విద్యుత్తు ఇస్తామంటూ గప్పాలు కొట్టిన యూపీలోని బీజేపీ సర్కారు.. ఆ హామీని తుంగలో తొక్కింది. రైతుల పొలాల్లోని బోరు బావుల వద్ద 20 రోజుల క్రితం కరెంటు మీటర్లను బిగించింది. మీటర్లను బిగించవద్దని రైతులు ఎంత మొత్తుకున్నా.. నిరసనలు చేపట్టినా పట్టించుకోలేదు. వారం గడిచింది. బోరు బావి దగ్గర బిగించిన కరెంటు మీటరు రీడింగ్ ఏడురోజులకే రూ. 5 వేల నుంచి రూ. 8 వేల వరకు చూపించడం ప్రారంభించింది. దీంతో లబోదిబోమన్న రైతన్నలు విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను పరిష్కరించాలంటూ రోజూ ఆఫీసు చుట్టూరే తిరిగారు. రైతన్న సమస్యను పట్టించుకున్న పాపానపోలేదు అధికారులు. దీంతో చిర్రెత్తుకొచ్చిన అన్నదాతలు.. బుధవారం బుధానా మండలంలోని కరెంటు ఆఫీసుకు వెళ్లి.. బోరు బావుల నుంచి ఊడబీక్కొని తెచ్చిన కరెంటు మీటర్లను కుప్పగా పోశారు. అధికారుల అలసత్వాన్ని విమర్శిస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు.
బిగించింది అందుకేనట..
బుధానాలో పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రి సంజీవ్ బాల్యన్ వద్ద ఈ అంశాన్ని మీడియా ప్రస్తావించింది. దీనిపై ఆయన మాట్లాడుతూ.. బిల్లుల కోసం బోరుబావులకు కరెంటు మీటర్లు బిగించలేదంటూ చెప్పుకొచ్చారు. ఒక్కో బోరుబావి ఎంత విద్యుత్తును వినియోగిస్తుందో తెలుసుకోవడానికే మీటర్లను బిగించినట్టు వెల్లడించారు. బోరుబావులపై బిల్లు రీడింగ్లను చూపించే కరెంటు మీటర్లను తీసేయడం తన బాధ్యత అని పేర్కొన్నారు.
మా డిమాండ్ ఇదే..
వారానికి రూ. 5,200 బిల్లు వస్తున్నది. ఇంత బిల్లు ఎలా కడుతాం? గతంలో తక్కువ మొత్తంలో బిల్లు వచ్చేది. ఇప్పుడు కూడా అలాగే రావాలి. ఇదే మా డిమాండ్.
– శోభారామ్ కశ్యప్, రైతు
అలా జరుగొచ్చేమో..
ఇవన్నీ కంప్యూటర్ జనరేటెడ్ బిల్స్. రీడింగ్లు లేకుండానే కొన్నిసార్లు బిల్లు వచ్చే ఆస్కారం కూడా ఉంది. ఇప్పుడే ఓ జూనియర్ ఇంజినీర్ ఈ సమస్యను నా దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేశా.
–ప్రశాంత్ కాంత్, ఎస్డీవో, బుధానా కరెంటు కార్యాలయం