న్యూఢిల్లీ, అక్టోబర్ 1: దేశంలో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. 19 కిలోల వాణిజ్య సిలిండర్పై తాజాగా రూ. 43ను పెంచారు. ఢిల్లీలో వాణిజ్య అవసరాలకు వినియోగించే సిలిండర్ ధర రూ.1,793కు చేరింది. తాజా పెంపు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చినట్టు చమురు కంపెనీలు పేర్కొన్నాయి.
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డుస్థాయికి చేరుకున్నాయి. లీటరు పెట్రోల్పై 25 పైసలు, లీటరు డీజిల్పై 30 పైసలు పెంచుతూ చమురు కంపెనీలు శుక్రవారం నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెంపుతో ఢిల్లీలో లీటరు పెట్రోలు రూ. 101.89, లీటరు డీజిల్ రూ. 90.17కు చేరుకున్నది. ముంబైలో లీటరు పెట్రోలు ధర రూ. 107.95గా ఉండగా, లీటరు డీజిల్ ధర రూ. 97.84కు చేరింది.
గడిచిన వారంలో పెట్రోలు రేట్లను మూడుసార్లు, డీజిల్ రేట్లను ఆరుసార్లు పెంచారు. దీంతో లీటరు పెట్రోలు ఇప్పటికే రూ. 100 మార్కును దాటిపోయి రూ. 120కి చేరువవుతుండగా.. డీజిల్ ధర కూడా అదే బాటలో పయనిస్తున్నది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఏపీ, ఒడిశా, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో లీటరు డీజిల్ ధర శుక్రవారంనాడు సెంచరీ దాటిపోయింది. రాజస్థాన్లోని శ్రీగంగానగర్లో రికార్డుస్థాయిలో శుక్రవారం లీటరు పెట్రోలు రూ. 113.73కు చేరగా, లీటరు డీజిల్ రూ. 103.9కు చేరింది.