న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీని గంగా జలంతో పోలుస్తూ ఆ పార్టీకి చెందిన అస్సాం నాయకుడు శిలాదిత్య దేవ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. అది కూడా కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మను సమర్థిస్తూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. న్యూస్లాండ్రీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బీజేపీలో చేరిన వారి పాపాలు ప్రక్షాళన అవుతాయని దేవ్ అన్నారు. బీజేపీలో చేరిన తర్వాత ముఖ్యమంత్రి బిశ్వశర్మ వైఖరిలో వచ్చిన మార్పును గురించి ప్రశ్నించగా పార్టీలు మారడం తమ పార్టీకి సమస్యే కాదని ఆయన చెప్పారు. బీజేపీ గంగాజలం లాంటిది.
గంగలో మీరు మునక వేస్తే అన్ని పాపాల నుంచి విముక్తి పొందుతారు. బీజేపీలోకి ఎవరైనా వస్తే వారు పాప విముక్తి పొందుతారు అని దేవ్ చెప్పారు. ప్రతిపక్షం చేస్తున్న వాషింగ్ మెషీన్ ఆరోపణను ప్రస్తావిస్తూ ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులు పార్టీ మారి ఉపశమనం పొందుతున్నారని చెప్పారు. వాణిజ్య కార్యకలాపాల్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ బీజేపీని వాషింగ్ మెషీన్ అంటున్నది. కాని మేము చాలా పవిత్రమైన వాళ్లము. మేము కొద్దిగా మతాభిమానులము. అందుకే మేము గంగాజలం అంటాము అని దేవ్ వ్యాఖ్యానించారు.