రేవా (మధ్యప్రదేశ్), డిసెంబర్ 28: సర్పంచ్ల అవినీతిని బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా తేలిగ్గా తీసిపారేశారు. రూ.15 లక్షలలోపు అవినీతి అసలు అవినీతే కాదని, అలాంటి ఫిర్యాదులతో ఎవరూ తన వద్దకు రావద్దని స్పష్టం చేశారు. ‘ప్రస్తుత సవాళ్లను అధిగమించడంలో మీడియా పాత్ర’ అనే అంశంపై సోమవారం మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో జరిగిన ఓ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సర్పంచ్ల అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు చాలా మంది తన వద్దకు వస్తున్నారని ఆయన పేర్కొంటూ.. రూ.15 లక్షలకు మించిన అవినీతి ఫిర్యాదులు ఉంటేనే తనను సంప్రదించాలని చెప్పారు. ఎన్నికల్లో సర్పంచ్గా గెలవాలంటే రూ.7 లక్షలు, తర్వాతి ఎన్నికలకు మరో రూ.7 లక్షలు అవసరమవుతాయని, ద్రవ్యోల్బణాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మరో రూ.లక్ష కలిపితే ఈ మొత్తం రూ.15 లక్షలు అవుతుందన్నది పచ్చి నిజమని పేర్కొన్నారు. కాగా, అవినీతి పట్ల జనార్దన్ మిశ్రాకు ఉన్న మక్కువకు ఈ వ్యాఖ్యలే నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది.