చెన్నై: ఒక కాలేజీ లెక్చరర్ బిచ్చగాడిలా మారాడు. రోడ్డుపై వెళ్తున్న భార్యను హత్య చేసేందుకు ప్రయత్నించాడు. బ్లేడ్తో ఆమెపై దాడి చేశాడు. తప్పించుకున్న ఆమె ఆ బిచ్చగాడిని తన భర్తగా గుర్తించింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడ్ని అరెస్ట్ చేశారు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ సంఘటన జరిగింది. 58 ఏళ్ల కుమారస్వామి ఎగ్మూర్లోని ఆర్ట్స్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. 38 ఏళ్ల భార్య జయవాణి ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో పని చేస్తున్నది. అయితే అక్కడి ఉద్యోగితో ఆమెకు వివాహేతర సంబంధం ఉందని కుమారస్వామి అనుమానించాడు. ఈ నేపథ్యంలో భార్యను హత్య చేయాలని ప్లాన్ వేశాడు.
కాగా, కుమారస్వామి అడుక్కునే వ్యక్తిగా వేషం వేశాడు. గురువారం సాయంత్రం ఎగ్మోర్లోని ఆంగ్లో ఇండియన్ క్వార్టర్స్ రోడ్డులో బస్సు దిగిన భార్య జయవాణిపై బ్లేడ్తో దాడి చేశాడు. ఆమె మెడ, ముఖంపై బ్లేడ్తో కోసేందుకు ప్రయత్నించాడు. దీంతో భయాందోళన చెందిన జయవాణి తన చేతులు అడ్డుపెట్టుకుని దాడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించగా ఆ బిక్షగాడు వెంబడించాడు. ఆమెపై బ్లేడ్తో దాడి చేయగా శరీరంపై పలు చోట్ల గాయాలయ్యాయి.
మరోవైపు దీనిని గమనించిన స్థానికులు స్పందించారు. జయవాణిపై దాడి చేసిన బిచ్చగాడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా అతడు పారిపోయాడు. అయితే తనపై దాడి చేసింది బిచ్చగాడి వేషంలో ఉన్న తన భర్తే అని జయవాణి గుర్తించింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన ఎగ్మోర్ పోలీసులు కుమారస్వామిని శుక్రవారం అరెస్ట్ చేశారు. అతడ్ని ప్రశ్నించగా నిజం ఒప్పకున్నాడు.
జయవాణి కుటుంబ స్నేహితుడైన కుమారస్వామి ఆమె తండ్రికి ఆర్థికంగా సహాయం చేశాడు. ఆమె చదువు ఖర్చులను కూడా భరించాడు. జయవాణి విద్యార్థిగా ఉండగా ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వారికి ముగ్గురు పిల్లలు. అయితే భార్యాభర్తల వయసులో ఇరవై ఏళ్ల తేడా ఉంది. ఈ నేపథ్యంలో భార్యతో కలిసి పని చేసే సహోద్యోగితో ఆమెకు సంబంధం ఉందని కుమారస్వామి అనుమానించాడు. దీంతో భార్యను హత్య చేసేందుకు అతడు ప్రయత్నించినట్లు పోలీసులు వెల్లడించారు.