లుణావాడా, మే 5: అరుదైన కండరాల సంబంధిత వ్యాధి (స్పైనల్ మస్క్యులర్ అట్రొఫీ)తో బాధపడుతున్న తమ 5 నెలల కుమారుడికి జీన్ థెరపీ ఇంజెక్షన్ కొనేందుకు ఆ దంపతులు దాతల నుంచి రూ.16 కోట్లు సేకరించారు. ఆ బాలుడికి ముంబైలోని ఓ ప్రైవేటు దవాఖానలో వైద్యులు బుధవారం ఇంజెక్షన్ చేశారు. గుజరాత్లోని లుణావాడాకు చెందిన రాజ్దీప్సిన్హ్ రాథోడ్, జినల్బా దంపతులు తమ కుమారుడు ధైర్యరాజ్ను కాపాడాలంటూ మార్చి నెలలో ‘ఇంపాక్ట్ గురు’ అనే వేదిక ద్వారా దాతలను అర్థించారు. కేవలం 42 రోజుల్లో రూ.16 కోట్లు వారికి దాతల నుంచి సమకూరాయి. స్విట్జర్లాండ్కు చెందిన దిగ్గజ ఔషధ సంస్థ నొవార్టిస్ తయారుచేస్తున్న ఆ ఇంజెక్షన్ ధర భారత్లో రూ.16 కోట్లు. దీనికి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇంజెక్షన్గా పేరుంది. కస్టమ్స్ సుంకం మరో రూ.6.5 కోట్లు ఉంటుంది. అయితే రాథోడ్ దంపతుల విజ్ఞప్తితో ఈ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది.