న్యూఢిల్లీ: కృత్రిమ మేధ, ఆటోమేషన్పై మరింత దృష్టి సారించే క్రమంలో 4 వేల మంది ఉద్యోగులపై వేటు వేయాలని కాగ్నిజెంట్ భావిస్తున్నది! తన కొత్త ‘ప్రాజెక్ట్ లీప్’లో భాగంగా ఈ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ తొలగింపుల వల్ల రూ.2,849 కోట్లు (320 మిలియన్ డాలర్లు) ఖర్చు అవుతున్నప్పటికీ.. ఈ సంవత్సరం చివరి నాటికి అంతే మొత్తం ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు.
వ్యయ నియంత్రణలో భాగంగా ఉద్యోగాల కోతకు కాగ్నిజెంట్ సిద్ధమవుతున్నది. మరోవైపు 20 వేల మంది కొత్తగా పట్టభద్రులైన ప్రవేశ స్థాయి ప్రతిభావంతులు, డిజిటల్ నైపుణ్యాలు ఉన్న వారిని ఉద్యోగులుగా నియమించుకోవాలని ఆ కంపెనీ ఆలోచిస్తున్నది. ప్రాజెక్ట్ లీప్లో ఉద్యోగులకు కొత్త నైపుణ్యాలు నేర్పించాలని, భవిష్యత్తు కోసం డిజిటల్ ఆవిష్కరణలపై మరింత దృష్టి సారించాలని కాగ్నిజెంట్ భావిస్తున్నది.