న్యూఢిల్లీ, అక్టోబర్ 9: పండగ పూట దేశవ్యాప్తంగా బొగ్గు సంక్షోభం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. అన్ని థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో బొగ్గు నిల్వలు నిండుకొన్నాయి. దేశంలో ఉన్న 135 థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో కనీసం నాలుగు రోజులకు సరిపడ బొగ్గు కూడా లేదు. దీంతో విద్యుదుత్పత్తిని తగ్గించక తప్పని పరిస్థితి నెలకొన్నది. ఉత్పత్తి తగ్గితే పండుగ వేళ ప్రజలు కరెంటు కోతలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉత్తరభారతంలో ఇప్పటికే కోతలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. ప్రధాని మోదీకి లేఖ రాశారు. బొగ్గు కొరతను అధిగమించడానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇతర అవసరాలకు వినియోగిస్తున్న బొగ్గును విద్యుదుత్పత్తి ప్లాంట్లకు తరలించాలని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. మరోవైపు, ఏపీకి 20 బొగ్గు ర్యాకులను కేటాయించాలని ఆ రాష్ట్ర సీఎం జగన్ కోరారు. బొగ్గు కొరత ఇలాగే కొనసాగితే విద్యుదుత్పత్తి నిలిపివేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని థర్మల్ కేంద్రాలు కేంద్రాన్ని హెచ్చరిస్తున్నాయి.
సగం ప్లాంటుల్లో 2 రోజులకే
ఇండియా విద్యుదుత్పత్తి కోసం ప్రధానంగా బొగ్గుపైనే ఆధారపడింది. దేశంలో 135 థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఉన్నా యి. వీటి ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 165 గిగావాట్లు. దేశానికి అవసరమైన 70శాతం విద్యుత్ వీటి నుంచే వస్తున్నది. ఈ కేంద్రాలకు రోజుకు సగటున 18 లక్షల టన్నుల బొగ్గు అవసరం. ప్రస్తుతం అన్ని కేంద్రాల్లో కలిపి 72 లక్షల టన్నులు మాత్రమే ఉంది. కనీసం ఒక్క ప్లాంటులో కూడా వారానికి సరిపడా బొగ్గు లేదు. సగం ప్లాంట్లలో కేవలం రెండు రోజులకు సరిపడా బొగ్గు మాత్రమే ఉంది. 17 ప్లాంట్లలో అసలు బొగ్గే లేదు. విద్యుదుత్పత్తి ఆగిపోయింది.
బాధ్యత గల పౌరుల్లా వాడండి
ఢిల్లీ డిస్కమ్లకు విద్యుత్ సరఫరా చేసే పవర్ ప్లాంట్లలో కేవలం రెండు రోజులకు సరిపడా బొగ్గు మాత్రమే ఉంది. ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలని ఢిల్లీ ప్రభుత్వం ప్రజలను కోరడం గమనార్హం. పంజాబ్, ఒడిశాలో కూడా బొగ్గు సంక్షోభం తీవ్రంగా మారింది. పంజాబ్లో కేవలం 5 రోజులకు సరిపోయే నిల్వలే ఉన్నాయి.
కొరతకు కారణమేంటి?
దేశంలో బొగ్గు సంక్షోభానికి ప్రధాన కారణం వర్షాలు, అంతర్జాతీయంగా బొగ్గు ధర పెరగడమేనని అధికారులు చెప్తున్నారు. దేశంలో నైరుతిలో పలు రాష్ర్టాల్లో భారీ వర్షాల కారణంగా బొగ్గు గనుల్లోకి వరద నీరు చేరింది. దీంతో ఉత్పత్తికి ఆటంకం కలిగింది. మరోవైపు అంతర్జాతీయంగా బొగ్గుకు భారీ డిమాండ్ ఉంది. ధరలు పెరిగాయి. దీంతో దిగుమతి చేసుకోలేని పరిస్థితి నెలకొందని కేంద్ర ప్రభుత్వాధికారులు చెప్తున్నారు.