న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సీఎన్జీ (CNG) ధరలు స్వల్పంగా తగ్గాయి. కిలో సీఎన్జీపై రూ.4 తగ్గిస్తూ ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (IGL) నిర్ణయం తీసుకున్నది. నేటి నుంచే ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. దీంతో ఢిల్లీలో రూ.77.20గా ఉన్న కిలో సీఎన్జీ ధర రూ.73.59కి తగ్గింది. నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్లో కూడా ఇదే ధరలు అమల్లో ఉండనున్నాయి. ఇక గురుగ్రామ్లో రూ.82.62గా ఉన్నది. గతేడాది డిసెంబర్ 17న ఢిల్లీలో సీఎన్జీ ధరలు పెరిగాయి. అప్పటి నుంచి ధరల్లో తగ్గుదల రావడం ఇదే మొదటిసారి. సీఎన్జీ ధరలు 2021-2022 డిసెంబర్ మధ్య 83 శాతం పెరిగాయి. 2021, ఏప్రిల్ నుంచి కిలో సీఎన్జీ ధర రూ.36.16గా ఉన్నది. కాగా, దేశ రాజధానిలో సీఎన్జీ ధరలు తగ్గిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ధరల్లో మార్పులు చేర్పులు రానున్నాయి.
సీఎన్జీతోపాటు గృహావసరాలకు వినియోగించే పైపుడ్ నేచురల్ గ్యాస్ (PNG) ధరను కూడా ఐజీఎల్ తగ్గించింది. ఢిల్లీలో ఇప్పటివరకు కిలో పీఎన్జీకి రూ.53.59గా ఉన్న ధర రూ.48.59కి దిగివచ్చింది.