న్యూఢిల్లీ: దేశంలో పెట్రో ధరల బాదుడుకు బ్రేక్ పడినప్పటికీ.. సీఎన్జీ (CNG ) ధరల పెంపు మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ నెల ఆరంభం నుంచి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) ధరలు క్రమం తప్పకుండా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా దేశీయ చమురు కంపెనీలు కిలోకు మరో రూ.3 వడ్డించాయి. దీంతో దేశరాజధాని ఢిల్లీలో సీఎన్జీ ధర కిలోకు రూ.69.11కి చేరింది. నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్ నగరాల్లో సీఎన్జీ కిలో ధర రూ.71.67 అయింది. ఇక గురుగ్రామ్లో రూ.77.44కు చేరింది. కాగా, దేశవ్యాప్తంగా గ్యాస్ ధరలు రికార్డు స్థాయికి చేరిన వారం రోజులలోపే సీఎన్జీ ధర కిలోకు రూ.9.6 పెరగడం గమనార్హం.
దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో 137 రోజుల పాటు స్థిరంగా ఉన్న పెట్రోల్ డీజిల్ ధరలు మార్చి 22 నుంచి క్రమం తప్పకుండా పెరుగుతూ వస్తున్నాయి. అదేరోజు గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధరను పెంచడంతో రూ.వెయ్యి దాటింది.