Arvind Kejriwal | మద్యం పాలసీ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరో సందేశం వినిపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ మంగళవారం మీడియా సమావేశంలో సీఎం సందేశాన్ని వినిపించారు. ‘నా పేరు అరవింద్ కేజ్రీవాల్. నేను ఉగ్రవాదిని కాను’ అని సందేశంలో ఆయన పేర్కొన్నారు. స్వాతంత్య్ర అనంతరం దేశంలో జరిగిన అతిపెద్ద కుంభకోణం ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ అని.. దాని ద్వారా బీజేపీకి లంచాలు వచ్చాయని విమర్శించారు. అయిని ప్రధాని ఎలక్టోరల్ బాండ్ స్కీమ్కు అండగా ఉంటున్నారని.. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తున్నారన్నారు.
ఈ సందర్భంగా సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. ఎన్నికైన ముఖ్యమంత్రులను ప్రధాని ఉగ్రవాదుల్లా చూస్తున్నారన్నారు. బీజేపీ, నరేంద్ర మోదీలో మధ్య ద్వేషం నిండిపోయిందని, అందుకే కేజ్రీవాల్ను ఆయన కుటుంబంతో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్తో కలవడానికి గాజుగోడను ఏర్పాటు చేస్తున్నారన్నారు. అరవింద్ కేజ్రీవాల్, ఆప్నేతలను కించపరిచేందుకు నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారన్నారు. అరవింద్ కేజ్రీవాల్ను విచ్ఛిన్నం చేసేందుకు ప్రధాని ఎంత ప్రయత్నిస్తే.. పోరాటం చేసేందుకు అంత బలంగా ఉంటారన్నారు. కేజ్రీవాల్ను టెర్రరిస్టులగా చూడడం ఆప్కి బాధ కలిగించే విషయమన్నారు. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అగ్నివీర్ యోజన, మణిపూర్ సమస్యతో సహా దేశ సమస్యలపై ప్రధాని ఏమీ స్పందించడం లేదన్నారు. అరవింద్ కేజ్రీవాల్పై కేంద్ర ప్రభుత్వం ద్వేషం, దురుద్దేశం, నియంతృత్వ వైఖరితో ఉందని విమర్శించారు.