CMFRI | కొచ్చి/హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): చెరువుల్లోనో, నదుల్లోనో, సముద్రాల్లోనో వలేసి చేపలు పట్టాలి.. తీసుకొచ్చి అమ్మాలి.. కోసి కూర వండాలి. ఈ తతంగమంతా ఎందుకు? చేప మాంసం కూడా తయారు చేసే పద్ధతి ఉంటే పోలా..! ల్యాబ్లోనే చేప మాంసం తయారు చేసే దిశగా కేరళలోని ఐసీఏఆర్-సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పలు దేశాల్లో ఈ దిశగా ప్రయోగాలు జరుగుతున్నాయి. అయితే తొలిసారి భారత్లో సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎంఎఫ్ఆర్ఐ) పరిశోధకులు ల్యాబ్లో చేప మాంసాన్ని అభివృద్ధి చేస్తున్నారు.
చేపల నుంచి సేకరించిన కొన్ని ప్రత్యేక కణాలను ల్యాబ్లో అభివృద్ధి చేసి చేప మాంసాన్ని ఉత్పత్తి చేస్తామని సీఎంఎఫ్ఆర్ఐ చెబుతున్నది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ల్యాబ్ను ఏర్పాటు చేయనున్నారు. కృత్రిమంగా తయారు చేసిన చేప మాంసం నిజమైన మాంసం రుచికి ఏమాత్రం తీసిపోదని పరిశోధకులు చెబుతున్నారు. ప్రయోగంలో భాగంగా తొలుత కింగ్ ఫిష్, చందువాయి చేప, సీర్ ఫిష్ మాంసాన్ని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టును ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టనున్నారు. కృత్రిమ చేప మాంసాన్ని తయారు చేయడానికి సీఎంఎఫ్ఆర్ఐ, కృత్రిమ మాంసం తయారీ సంస్థ ‘నీట్ మీట్ బయోటిక్’ చేతులు కలిపాయి. ఈ మేరకు ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా.. సముద్రపు చేపల జాతుల ప్రారంభ సెల్ లైన్ అభివృద్ధిపై సీఎంఎఫ్ఆర్ఐ పరిశోధన చేయనున్నది. అనంతరం కణాలను వేరు చేసి పెంపకం చేపట్టనున్నారు. ఇందు కోసం ‘సెల్ కల్చర్ ల్యాబొరేటరీ’ని ఇప్పటికే ఏర్పాటు చేసింది. ప్రయోగశాలలో చేప మాంసాన్ని అభివృద్ధి చేయడం ద్వారా పర్యావరణ, ఆహార భద్రత ప్రయోజనాలను పొందొచ్చు. అంతేగాక సముద్ర జీవుల సమతౌల్యాన్ని సంరక్షించొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.