లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం చేసిన బుల్డోజర్ వ్యాఖ్యలను పీఎస్పీ నేత శివపాల్ సింగ్ యాదవ్ తప్పుపట్టారు. తిరిగి అధికారంలోకి వచ్చాక బుల్డోజర్లకు పని చెబుతామని, ప్రస్తుతం అవి విశ్రాంతిలో ఉన్నాయన్న యోగి ఆదిత్య నాథ్ మాటలు ఆయన హోదాకు విరుద్ధమని విమర్శించారు. బీజేపీ ఫలితాలపై ఇది ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించారు. బీజేపీ కేవలం గుడి-మసీదు, హిందూ-ముస్లిం గురించి మాత్రమే మాట్లాడుతున్నదని ఆరోపించారు. బీజేపీ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని దుయ్యబట్టారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) కూటమి విజయం సాధిస్తుందని శివపాల్ సింగ్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ ఎంత ప్రయత్నించినా ప్రయోజనం ఏమీ ఉండదన్నారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అవినీతి, విద్యుత్ సమస్యలు మాత్రమే గత ఐదేండ్లలో మిగిలి ఉన్నాయన్నారు. పశ్చిమ యూపీలో 50-58 సీట్లు, సెంట్రల్ యూపీలో 45-50 సీట్లు ఎస్పీ కూటమి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కాగా, ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ సోదరుడు, అఖిలేష్ యాదవ్కు బాబాయ్ అయిన శివపాల్ సింగ్ ఆ పార్టీ నుంచి వీడి సొంతగా పీఎస్పీని ఏర్పాటు చేశారు. అయితే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎస్పీతో ఆయన జతకట్టారు. అబ్బాయ్ అఖిలేష్కు, బాబాయ్ శివపాల్ సింగ్ మద్దతు ఇచ్చారు. అఖిలేష్తో కలిసి ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొంటున్నారు.