లక్నో: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ ఐదు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం రోజురోజుకు హీటెక్కుతున్నది. అన్ని పార్టీలు ఎన్నికల ప్రచార వ్యూహరచన, అభ్యర్థుల ఎంపిక తదితర పనులతో బిజీబిజీగా ఉన్నాయి. ఇక 403 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఉత్తరప్రదేశ్లో ఎన్నికల హడావిడి మరింత ఎక్కువగా ఉన్నది. అధికార బీజేపీ ఇవాళ 95 మంది అభ్యర్థుల పేర్లతో తొలి జాబితాను ప్రకటించింది.
బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో మొదటి, రెండో దశ ఎన్నికల్లో పోటీపడే అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. యూపీ ముఖ్యమంత్రి యోగీ అదిత్యనాథ్, ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పోటీచేయబోయే నియోజకవర్గాల వివరాలను కూడా తొలి జాబితాలోనే వెల్లడించారు. సీఎం యోగీ ఆదిత్యనాథ్ గోరఖ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ పడనున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రయాగ్ రాజ్ జిల్లాలోని సిరాతు స్థానం నుంచి తలపడనున్నారు.
యూపీలో మొత్తం ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 10న మొదటి దశ పోలింగ్, మార్చి 7న తుదిదశ పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఈ ఏడు దశల్లో ఉత్తరప్రదేశ్తోపాటు ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగనున్నాయి.