BJP : కర్నాటక ముఖ్యమంత్రిని బీజేపీ అధిష్ఠానం మరోమారు మార్చబోతోంది. మొన్నటికి మొన్న యడియూరప్పను ముఖ్యమంత్రి పీఠంపై దించేసి, బసవరాజ బొమ్మైను ఆ సీటులో కూర్చోబెట్టింది. ఇప్పుడు బొమ్మైను కూడా అధిష్ఠానం మార్చేయనుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియడమే ఆలస్యం, బొమ్మైను బీజేపీ అధిష్ఠానం మార్చేయనుంది. బొమ్మై పరిపాలనపై బీజేపీ ఏమాత్రం సంతృప్తికరంగా లేదని తెలుస్తోంది. ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అత్యంత పేలవమైన ప్రదర్శనను కనబరిచిందని, అంతే కాకుండా సీఎం సొంత నియోజకవర్గమైన హనాగళ్లో కూడా పేలవంగానే ఫలితాలు వచ్చాయని, అందుకే బొమ్మైపై అధిష్ఠానం తీవ్ర అసంతృప్తితో ఉంది. ఈ పేలవ ప్రదర్శనే వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై పడే ఛాన్స్ ఉందని బీజేపీ అధిష్ఠానం భయపడుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా బొమ్మైపై పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా తీవ్ర అసంతృప్తితోనే వున్నారు. ఈ కారణంగానే బీజేపీ అధిష్ఠానంపై ఆయనను పక్కకు తప్పించనుంది.
అయితే బొమ్మై స్థానంలో ఎవర్ని ముఖ్యమంత్రిగా నియమించాలన్న దానిపై అధిష్ఠానం ఓ కన్నేసిందని తెలుస్తోంది. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికల తంతు ముగిసిన తర్వాత దీనిపై పూర్తి స్థాయిలో హోంవర్క్ చేయనుంది బీజేపీ అధిష్ఠానం. ఈసారి లింగాయత్ వర్గం నుంచే యువ నేతను బీజేపీ అధిష్ఠానం ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఇది సాధ్యం కాని పక్షంలో దళిత సామాజిక వర్గానికి చెందిన నేతను సీఎం పదవిలో కూర్చోబెట్టాలన్న ఆలోచన కూడా బీజేపీ అధిష్ఠానంలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక కేబినెట్ను కూడా ప్రక్షాళన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈశ్వరప్ప, మురుగేశ్ నూరానీ, సీసీ పాటిల్, ప్రభుత చౌహాన్ లాంటి వారిని తొలగించనున్నట్లు సమాచారం. అయితే ముందు సీఎంని మార్చేసిన తర్వాతే, కేబినెట్ వైపు దృష్టి పెట్టాలని, ఆ తర్వాత పార్టీ పటిష్ఠతపై దృష్టి సారించాలని బీజేపీ వ్యూహకర్తల బృందం నిర్ణయించుకుంది.