ముంబై: తన రాజీనామా లేఖ సిద్ధంగా ఉందని మహారాష్ట్ర సీఎం, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. తనపై నమ్మకం లేదని ముఖాముఖిగా ఒక్క రెబల్ ఎమ్మెల్యే చెప్పినా వెంటనే సీఎం పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. శివసేన మంత్రి ఏక్నాథ్ షిండే తిరుగుబాటు చేసిన నేపథ్యంలో బుధవారం సాయంత్రం పార్టీ అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చిన ఉద్ధవ్ చివరి నిమిషంలో దానిని రద్దు చేశారు. కరోనా సోకిన ఆయన ఫేస్బుక్ లైవ్ ద్వారా రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. శివసేన ఎప్పుడూ కూడా హిందుత్వాన్ని వీడలేదన్నారు. తన తండ్రి బాలసాహెబ్ ఠాక్రే ఇదే తమకు నేర్చించారని చెప్పారు.
తనపై నమ్మకం లేదని కాంగ్రెస్ లేదా ఎన్సీపీ చెప్పలేదని, సొంత పార్టీ నేతలు ఈ మాట అనడం తనకు బాధగా ఉందని ఉద్ధవ్ ఆవేదన చెందారు. ‘నేను సీఎంగా వద్దని నా ప్రజలు అనుకుంటే, లేదా ఎవరైనా ఎమ్మెల్యేలు నన్ను ముఖ్యమంత్రిగా వద్దని చెబితే, వెంటనే రాజీనామా చేస్తా. సీఎం అధికార నివాసం వర్షాను వీడి మాతోశ్రీకి వెళ్తా’ అని అన్నారు. అయితే రెబల్ ఎమ్మెల్యేలు తన ముందుకు వచ్చి ముఖాముఖిగా ఈ విషయం చెప్పాలన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేల విశ్వాసం కోల్పోవడం తనకు సిగ్గుగా ఉందన్నారు.
సీఎం పదవి కోసం పాకులాడే వ్యక్తిని తాను కాదన్న ఉద్ధవ్, సూరత్కు వెళ్లి అక్కడ ఎందుకు ఈ విషయం మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. వెన్నంటే ఉంటామని చెప్పి ఎందుకు మోసం చేస్తున్నారని నిలదీశారు. తమను బలవంతంగా తీసుకెళ్లారని కొందరు ఎమ్మెల్యేలు చెబుతున్నారని, అయితే ఆ విషయాలు తనకు అవసరం లేదన్నారు. శివ సైనికులే తనకు ముఖ్యమని, వారు ఏం చెబితే అది చేస్తానని అన్నారు. రాజీనామాకు కూడా సిద్ధమని, లేఖ కూడా కార్యాలయంలో సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఎవరైనా సరే దీనిని తీసుకుని గవర్నర్కు ఇవ్వవచ్చని తెలిపారు. అవసరమైతే పార్టీ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేస్తానన్నారు. ఒక శివ సైనికుడు సీఎం అయితే సంతోషిస్తానని అన్నారు.