MK Stalin | ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) అధ్యక్షుడిగా వరుసగా రెండోసారి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఎన్నికయ్యారు. ఆదివారం చెన్నైలో జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో డీఎంకే అధ్యక్ష పదవికి స్టాలిన్ పేరును పార్టీ నేతలు ఏకపక్షంగా ఆమోదించారు. అలాగే, సీనియర్ నాయకులు ప్రధాన కార్యదర్శిగా దురై మురుగన్, కోశాధికారిగా టీఆర్ బాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరు ముగ్గురూ రెండోసారి వరుసగా ఏకగ్రీవంగా ఎన్నికవడం విశేషం. 1949 లో డీఎంకేను స్థాపించగా.. 1969 లో కరుణానిధి పార్టీ అధ్యక్షుడయ్యారు. అప్పటివరకు పార్టీ వ్యవస్థాపకుడు అన్నాదురై పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.
డీఎంకే పార్టీ ముఖ్య కార్యదర్శిగా కేఎన్ నెహ్రూను నియమితులయ్యారు. గతంలో డీఎంకే మహిళా విభాగానికి నేతృత్వం వహించిన కనిమొళి కరుణానిధిని ప్రస్తుతం డీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీగా నియమించారు. పెరియసామి, కే పొన్ముడి, ఏ రాజా, అంతియూర్ సెల్వరాజ్లతో పాటు కనిమొళిని కూడా డిప్యూటీ జనరల్ సెక్రటరీలుగా నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కరుణానిధి మరణంతో 2018 లో స్టాలిన్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అనంతరం 209 పార్లమెంట్ ఎన్నికల్లో, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తూ వచ్చింది. పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎంకే స్టాలిన్.. గతంలో పార్టీ కోశాధికారిగా, పార్టీ యువజన విభాగం కార్యదర్శిగా సేవలందించారు.
పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో డీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ పెరియసామి బీజేపీని టార్గెట్ చేస్తూ ప్రసంగించారు. తమిళనాడులో పెద్ద కూటమి ఏర్పడినా డీఎంకే ఒంటరిగానే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి అందరినీ ఓడించగలదని బీజేపీ, ఏఐడీఎంకేకు సవాలు విసురుతున్నా అన్నారు. వచ్చే 20 ఏండ్ల పాటు తమిళనాడు సీఎంగా ఎంకే స్టాలిన్ ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.