రాంచీ: ‘చీటికి మాటికి నోటీసులెందుకు? నేను తప్పు చేశానని భావిస్తే వచ్చి డైరెక్ట్గా అరెస్టు చేయండి’ అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులపై జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ తీవ్రంగా స్పందించారు. అక్రమ మైనింగ్ కేసులో తమ ముందు హాజరుకావాలన్న ఈడీ ఆదేశాలను సొరేన్ పట్టించుకోలేదు. గురువారం ఛత్తీస్గఢ్లో జరిగే ‘గిరిజన మహోత్సవం’ కార్యక్రమానికి రావాల్సిందిగా ముందుగానే తనకు ఆహ్వానం అందిందని, అందుకే అక్కడికి వెళ్లానని చెప్పారు. రాంచీ నుంచి బయలుదేరేముందు ఆయన మాట్లాడుతూ ‘నాపై కుట్రలో భాగంగానే నోటీసులు జారీ చేస్తున్నారు. ఒకవేళ నేను తప్పు చేస్తే వచ్చి అరెస్టు చేయండి. అంతేగానీ చీటికిమాటికి ఇలా నోటీసులు ఇస్తూ ఇబ్బంది పెట్టకండి. నేనేమైనా దొంగనా? హంతకుడినా? నిన్న నోటీసులిచ్చి, ఈ రోజు రమ్మంటే ఎలా? ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉండవా?’ అంటూ ఈడీపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇలాంటి నోటీసులు, బెదిరింపులకు తాను భయపడనని చెప్పారు. ఇంకా బలమైన వ్యక్తిగా తయారవుతానని తెలిపారు. జార్ఖండ్ ప్రజలు తల్చుకొంటే ప్రతిపక్షాలకు దాక్కోవటానికి కూడా స్థలం దొరకదని హెచ్చరించారు. ‘ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడిన ప్రభుత్వాలను కూల్చడమే బీజేపీ పని. ఇందు కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నది. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఉగ్ర రాజకీయమే. బీజేపీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి.. ఇది జార్ఖండ్ గడ్డ.. ఈ గడ్డను పాలించేవాళ్లు జార్ఖండ్ వాసులే ఉంటారు. బయటి వాళ్లకు ఇక్కడ చోటు లేదు’ అని సొరేన్ ధ్వజమెత్తారు. మరోవైపు తమ నాయకుడిని ఈడీ తరుచుగా ఇబ్బందులకు గురిచేస్తున్నదని, విచారణ పేరుతో నోటీసులు జారీ చేస్తున్నదని పేర్కొంటూ జేఎంఎం కార్యకర్తలు రాంచీలో గురువారం ర్యాలీ చేపట్టారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.తాను హాజరు కావటానికి మూడు వారాల సమయం ఇవ్వాలని ఈడీని సొరేన్ కోరినట్టు తెలిసింది.