బెంగళూరు, మే 23: కర్ణాటక కాంగ్రెస్ సర్కారులో అప్పుడే లుకలుకలు ప్రారంభమయ్యాయి. వర్గ వివాదాలు, విభేదాలు కాంగ్రెస్ సంస్కృతి అన్న విషయం మరోసారి రుజువైంది! అధిష్ఠానం ఒత్తిడితో డిప్యూటీ సీఎం పోస్టుతో డీకే శివకుమార్ సరి పెట్టుకొన్న వేళ, సీఎం పదవిపై సీనియర్ మంత్రి ఎంబీ పాటిల్ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. సిద్ధరామయ్యే ఐదేండ్లు సీఎంగా కొనసాగుతారని, అధికారం పంచుకోవడం ఉండదని మీడియాకు వెల్లడించారు. పాటిల్ వ్యాఖ్యలతో అప్సెట్ అయిన డీకే శివకుమార్ దీనిపై తనను విసిగించొద్దని మీడియాతో అన్నారు. పాటిల్ వ్యాఖ్యల సంగతి అధిష్ఠానం చూసుకుంటుందని డీకే సోదరుడు సురేశ్ వ్యాఖ్యానించారు. అయితే పాటిల్ మాత్రం మరోసారి తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. తమ పార్టీ జనరల్ సెక్రటరీ చెప్పినదాన్నే తాను చెప్పానని తెలిపారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు అనుంగు అనుచరుడైన పాటిల్కు, డీకే శివకుమార్కు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తున్నదని సమాచారం.