బెంగళూరు, డిసెంబర్ 23: విద్యాసంస్థల్లో మహిళల హిజాబ్ ధారణపై కర్ణాటకలో నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు ప్రకటన చేసిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 24 గంటలు కూడా కాకముందే దానిపై యూటర్న్ తీసుకున్నారు.
ప్రస్తుతం అమలవుతున్న హిజాబ్ ధారణ నిషేధాన్ని తొలగించాలని ప్రభుత్వం యోచిస్తున్నదని, ఇంకా తొలగించలేదని, దీనిపై ఉన్నత స్థాయిలో చర్చలు జరిపిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన శనివారం ప్రకటించారు. నిషేధం ఎత్తివేత ఈ ఏడాది ఉంటుందా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఉన్నత స్థాయిలో చర్చలు అనంతరమే దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.