Nitish Samadhan Yatra | దేశంలో రాజకీయ పార్టీల యాత్రలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పాదయాత్రలు, బస్సు యాత్రలు కొనసాగుతున్నాయి. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేపట్టిన భారత్ జోడో యాత్ర జరుగుతున్నది. ఇదే సమయంలో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా యాత్ర చేపడుతున్నారు. 2005 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో నితీశ్ 14 సార్లు పర్యటించారు. వీటిలో 9 అధికార పర్యటనలు కాగా, 5 రాజకీయ సంబంధమైనవి.
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సమాధాన్ యాత్ర ప్రారంభమైంది. తీవ్రమైన చలి మధ్య బగాహాలోని దారుబారి గ్రామం నుంచి తన యాత్రను మొదలుపెట్టారు. ప్రజలతో నేరుగా మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా నితీష్ కుమార్ చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది. బడ్జెట్ సెషన్ అనంతరం దేశవ్యాప్త పర్యటన చేపట్టనున్నట్లు చెప్పి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ముందుగా బిహార్ రాష్ట్ర అభివృద్ధిని చూసేందుకు సమాధాన్ యాత్ర పేరుతో బయల్దేరానని నితీశ్ కుమార్ చెప్పారు. బిహార్ ప్రజలకు ఇంకా అవసరమైన పనులను చేసి పెట్టిన తర్వాత మరింత ముందుకెళ్తానన్నారు. బడ్జెట్ సెషన్ పూర్తయిన తర్వాత దేశ పర్యటనకు వెళ్తానని వెల్లడించారు.
సమాధాన్ యాత్ర ప్రారంభానికి ముందు దారుబారి గ్రామంలోని బాలికలు తమకు పాఠశాల కావాలని ముఖ్యమంత్రిని కోరారు. దీనిపై వెంటనే స్పందించిన నితీశ్.. పరిశీలించాలని అధికారులను అక్కడికక్కడే సూచించారు. గ్రామంలోని చెరువులో చేపలకు ఆహారం వదిలారు. దారుబారి గ్రామంలో ప్రజలతో మాట్లాడేందుకు ఏర్పాటుచేసిన వేదికను ముగ్గులతో అలంకరించారు. బిహార్లో అభివృద్ధి పనులు, పథకాల అమలు పురోగతిని సమీక్షించేందుకు ఇవాల్టి నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాలను సందర్శిస్తున్నట్లు యాత్ర ప్రారంభానికి ముందు ట్విట్టర్లో నితీశ్ కుమార్ పేర్కొన్నారు. గతంలో న్యాయ యాత్ర, వికాస్ యాత్ర, థ్యాంక్స్గివింగ్ యాత్ర, ప్రవాస్ యాత్ర, విశ్వాస్ యాత్ర, సేవా యాత్ర, అధికార్ యాత్ర, సంకల్ప్ యాత్ర, సంపర్క్ యాత్ర, నిశ్చయ్ యాత్ర, సమీక్ష యాత్ర, జల్ జీవన్ హరియాలి యాత్ర, సోషల్ రిఫామ్స్ కంపెయిన్ వంటివి నితీశ్ చేపట్టి ప్రజల్లోకి వెళ్లారు.