న్యూఢిల్లీ: ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఔదర్యాన్ని ప్రదర్శించారు. మదర్ థెరిస్సా ఛారిటీ సంస్థలకు లక్షల్లో ఆయన నిధులను మంజూరీ చేశారు. కోల్కతా కేంద్రంగా నడుస్తున్న మదర్ థెరిస్సా ఛారిటీకి ఇటీవల విదేశీ నిధులను కేంద్రం నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒడిశాలో ఆ ఛారిటీకి చెందిన 13 సంస్థలకు నిధులను విడుదల చేసేందుకు ఒడిశా సీఎం ముందుకు వచ్చారు. ఛారిటీ సంస్థలకు 78.76 లక్షల నిధులను విడుదల చేస్తున్నట్లు సీఎం నవీన్ పట్నాయక్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఒడిశాలో మొత్తం 8 జిల్లాల్లో 13 మదర్ థెరిస్సా ఛారిటీ హోమ్స్ ఉన్నాయి. వాటిల్లో సుమారు 900 మంది జీవనం సాగిస్తున్నారు. అయితే ఆ ఎన్జీవో సంస్థలకు నిధులు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం పట్నాయక్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆ నిధులను వాడనున్నట్లు చెప్పారు.