వివిధ రాష్ట్రాలకు, ప్రతిపక్ష నేతలకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాసిన లేఖపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ స్పందించారు. ఇప్పటి వరకైతే తనకు మమతా లెటర్ అందలేదని స్పష్టం చేశారు. అయినా.. తాము తమ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం వైపే దృష్టి నిలుపుతామని స్పష్టం చేశారు. తమ పార్టీ విధానం కూడా అదేనని తేల్చి చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని, ఈ చర్చ తమ పార్టీలో ఇంకా రాలేదని అన్నారు. ఒడిశా ముఖ్యమంత్రి పట్నాయక్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. స్పోర్ట్స్ మీట్లో పాల్గొనడానికి వచ్చానని తెలిపారు. గురువారం తమ పార్టీ ఎంపీలతో సమావేశమవుతానని, రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులపై చర్చ ఉంటుందని నవీన్ పట్నాయక్ పేర్కొన్నారు.
ప్రతిపక్ష పార్టీలకు, వివిధ రాష్ట్రాల సీఎంలకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లేఖ రాశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తున్నట్లు ఆమె ఆ లేఖలో ఆరోపించారు. ఈ విషయంలో పోరాటం చేపట్టేందుకు అన్ని పార్టీలు కలిసి రావాలని ఆమె పిలుపునిచ్చారు. ఆదివారం ఆ లేఖను రిలీజ్ చేశారు. ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేసేందుకు బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుతున్నట్లు ఆమె ఆరోపించారు. ఎక్కడైనా ఎన్నికలు జరుగుతున్నాయంటే ఆ సమయంలో దర్యాప్తు సంస్థలను బీజేపీ వాడుకుంటోందన్నారు. అందరికీ అనుకూలమైన ప్రదేశంలో ఈ అంశం గురించి చర్చిచేందుకు రావాలని, దేశంలోని ప్రగతిశీల పార్టీలు ఒక్కటిగా నిలిచి అణిచివేత దళాన్ని అడ్డుకోవాలన్నారు.