కేంద్ర హోంమంత్రి అమిత్షాకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీ జహంగీర్పూరీ, యూపీ, మధ్యప్రదేశ్లో జరుగుతున్న వ్యవహారాలపై దృష్టి నిలిపాలని సూచించారు. బెంగాల్ గురించి బెంగ అవసరం లేదని, తాము చూసుకుంటామని ఆమె కౌంటర్ ఇచ్చారు. బెంగాల్లో హింస పెరిగిపోతోందన్న అమిత్షా వ్యాఖ్యలకు సీఎం మమత పై విధంగా కౌంటర్ ఇచ్చారు.
రాష్ట్రంలో విభజనలు సృష్టించడమే బీజేపీ అని సీఎం మమత ఎద్దేవా చేశారు. ఇంత జరుగుతున్నా.. కేంద్ర హోంమంత్రిగా ఉన్న అమిత్షా ఏం చేశారని సూటిగా ప్రశ్నించారు. ఈద్ పర్వదినం రోజున కూడా వాళ్లు హింసను ప్రేరేపించారని ఆమె మండిపడ్డారు.
రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా, తాము కఠిన చర్యలు తీసుకుంటున్నామని సీఎం పేర్కొన్నారు. ఈ సమయంలో పార్టీలకతీతంగా చర్యలు చేపడుతున్నామని ఆమె పేర్కొన్నారు. హోంమంత్రిగా ఉన్నందుకు అమిత్షాను అభినందిస్తున్నానని అన్నారు. అయితే.. తనకు ఎలాంటి మార్గనిర్దేశనం అవసరం లేదని స్పష్టం చేశారు. శాంతి భద్రతలు, అక్రమ రవాణా, గో అక్రమ రవాణా లాంటి విషయాలను చూసుకోవాల్సిన బాధ్యత ఆయనదేనని మమత కౌంటర్ ఇచ్చారు.
కోవిడ్ తగ్గిన తర్వాత సీఏఏను అమలు చేస్తామన్న కేంద్రహోంమంత్రి అమిత్షా వ్యాఖ్యలకు కూడా సీఎం మమత స్పందించారు. ఇన్ని రోజులుగా గడిచినా, ఇంకా పార్లమెంట్లో ఎందుకు ప్రవేశపెట్టలేదని ప్రశ్నించారు. ప్రజల హక్కులను కాలరాయడం తనకు ఇష్టం లేదని, అందరూ కలిసి మెలిసి ఉండాలన్నదే తన అభిమతమని మమత స్పష్టం చేశారు.