బీర్భూమ్ జిల్లాలో జరిగిన సజీవ దహనం విషయంపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఇలాంటి సంఘటనలు గుజరాత్, రాజస్థాన్లో కూడా చోటు చేసుకున్నాయని వ్యాఖ్యానించారు. అయితే తాను ఈ సంఘటనలను ఏమాత్రం సమర్థించడం లేదని, పూర్తి పారదర్శకతతోనే విచారణ చేస్తామని హామీ ఇచ్చారు. ‘ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం. రాష్ట్ర ప్రజల విషయంలో ఆందోళనలు చెందుతున్నాము. ఎవ్వరూ ఇబ్బందులు పడటం మాకు ఇష్టముండదు. బీర్భూమ్, రాంపూర్హట్లో జరిగిన సంఘటనలు అత్యంత దురదృష్టకరం. వెంటనే ఓసీ, యస్డీపీఓ అధికారులను డిస్మిస్ చేస్తున్నారు. రేపు రాంపూర్హట్కు నేను వెళ్తున్నాను’ అంటూ మమత బెనర్జీ ప్రకటించారు.
ఇక సంఘటనా స్థలాన్ని బీజేపీ నేతలు సందర్శించడంపై దీదీ స్పందించారు. ‘ఇది బెంగాల్. యూపీ కాదు. హాథ్రస్ ఘటన నేపథ్యంలో తృణమూల్ నేతలు అక్కడికి వెళ్లారు. వారిని పోలీసులు వెళ్లనివ్వలేదు. కానీ.. మేమలా చేయడం లేదు. మేము ఎవ్వర్నీ ఆపడం లేదు’ అంటూ మమతా బెనర్జీ చురకలంటించారు.
పశ్చిమబెంగాల్లో హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. బీర్భుమ్ జిల్లాలోని రాంపూర్హట్ శివారులోని బొగ్తూయ్ గ్రామంలో ఎనిమిది ఇండ్లకు గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టడంతో ఇద్దరు చిన్నారులు సహా 8 మంది సజీవ దహనమయ్యారు. బర్షాల్ గ్రామంలో టీఎంసీ నేత భదు సోమవారం రాత్రి హత్యకు గురయ్యారు. ఈ హత్య జరిగిన కొద్ది గంటలకే అంటే మంగళవారం తెల్లవారుజామున దుండగులు ఇండ్లకు నిప్పు పెట్టారు. ఏడుగురి మృతదేహాలు పూర్తిగా కాలిన స్థితిలో ఉండగా, ఒకరు మాత్రం దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందినట్టు డీజీపీ మనోజ్ మాలవీయ తెలిపారు. ఘటనకు సంబంధించి 11 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు.