చండీఘఢ్ : వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ప్రజలను ఆకట్టుకునేందుకు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ (Manohar Lal Khattar) చేపట్టిన జనతా దర్బార్ వివాదాలకు వేదిక అవుతోంది. రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో ఈ కార్యక్రమం నిర్వహించగా సీఎం ఖట్టర్ పలుమార్లు సంయమనం కోల్పోవడం వివాదాస్పదమైంది. మహిళలపై విరుచుకుపడటం, విపక్ష నేతల అణిచివేతతో జనతా దర్బార్ రసాభాసగా మారింది.
సీఎం జనతా దర్బార్ కొనసాగుతుండగా ప్రతిపక్షాల నిరసనలను కట్టడి చేసేందుకు పోలీసులు విపక్ష నేతలను గృహ నిర్బంధంలోకి తీసుకోవడం కలకలం రేపుతోంది. జనతా దర్బార్ కోసం సీఎం మూడు రోజుల పాటు సిర్సా పర్యటనకు రాగా ఇది లాఠీ దర్బార్గా మారిందని సీనియర కాంగ్రెస్ నేత రాజ్ కుమార్ శర్మ ఆరోపించారు. ఎలాంటి కారణం లేకుండానే తనను మూడు రోజులు హౌస్ అరెస్ట్ చేశారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
సీఎం తన ఎనిమిదిన్నరేండ్ల పాలనలో సిర్సాకు ఏకంగా 135 పధకాలు ప్రకటించినా 90 శాతం పధకాలు ఇంకా అమలుకు నోచుకోలేదని అన్నారు. సీఎం జనతా దర్బార్ సాగుతున్న మూడు రోజులు తనను గృహ నిర్బంధంలో ఉంచారని హర్యానా సర్పంచుల అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు సంతోష్ బెనివల్ చెప్పారు. ఈ-టెండరింగ్ వ్యవహారంలో సీఎం ఖట్టర్ను ఘొరావ్ చేస్తామని సర్పంచుల సంఘం హెచ్చరించడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన తెలపడం ప్రజాస్వామిక హక్కని, కానీ ఖట్టర్ సర్కార్ ప్రజల హక్కులను కాలరాస్తోందని ఆమె దుయ్యబట్టారు.
Read More