అకోలా: మహారాష్ట్రలోని అకోలాలో హింస(Akola Violence)కు కారణమైన మాస్టర్మైండ్ అర్బాజ్ ఖాన్(Arbaaz Khan)ను పోలీసులు అరెస్టు చేశారు. అర్బాజ్ ముస్లింలను రెచ్చగొట్టినట్లు పోలీసులు తేల్చారు. వీఎఫ్ఎక్స్ రెండో సంవత్సరం చదువుతున్న ఆ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. మే 15వ తేదీన అకోలాలో హింస చెలరేగింది. మహమ్మద్ ప్రవక్తపై ఇన్స్టాగ్రామ్ పోస్టు వివాదాస్పదం కావడంతో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. రాళ్ల దాడి, హింస వల్ల ఓ వ్యక్తి మరణించాడు. ఆ అల్లర్లలో 8 మంది గాయపడ్డారు. అకోలాలో సీఆర్పీఎఫ్ సెక్షన్ కింద 144 సెక్షన్ విధించారు.
అర్బాజ్ ఖాన్ చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్టు వివాదానికి కారణమైనట్లు తేల్చారు. ఆ పోస్టును సర్క్యులేట్ చేసిన అతను.. రామ్దాస్ పేట పోలీసు స్టేషన్ వద్దకు భారీ సంఖ్యలో జనం వచ్చేలా చేశాడు. దీంతో అక్కడ పరిస్థితి అత్యంత సున్నితంగా మారింది. ఈ ఘటనలో 150 మందిని అరెస్టు చేశారు. ఇన్స్టాగ్రామ్లో చాట్ను ఎడిటింగ్ చేసి పోస్టు చేసినందుకు అర్బాజ్ ఖాన్ను అదుపులోకి తీసుకున్నట్లు అకోలా ఎస్పీ సందీప్ గుగే తెలిపారు.
ద కేరళ స్టోరీ చిత్రం చూసిన సమీర్ సోనావానే అనే వ్యక్తి ఆ ఫిల్మ్కు అనుకూలంగా ఓ పోస్టు చేశాడు. అయితే ఆ పోస్టు విషయంలో ఆగ్రహంతో ఉన్న అర్బాజ్ ఆ వ్యక్తితో చాటింగ్ చేశాడు. ఆ తర్వాత చాటింగ్ను ఎడిట్ చేసి తన ఇన్స్టాలో పోస్టు చేశాడు. దీంతో ఆ పోస్టు వైరల్ అయ్యింది. ముస్లింలను రెచ్చగొట్టే రీతిలో ఆ పోస్టు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ముస్లింలను రెచ్చగొట్టడమే కాకుండా.. వాళ్లంతా పోలీసు స్టేషన్పై అటాక్ చేసి విధ్వంసం సృష్టించేలా చేశాడు. ఈ ఘటనలో పోలీసులు అర్బాజ్పై కేసు బుక్ చేశారు.