Arvind Kejriwal | కేంద్రంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. సరిగ్గా పంజాబ్ ఎన్నికల కంటే ముందు తమ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ను ఈడీ అరెస్ట్ చేస్తుందన్న సమాచారం తమకు అందిందని ఆరోపించారు. అయితే ఈ దర్యాప్తు సంస్థలకు ఆప్ నేతలు, కార్యకర్తలు భయపడరని, ఎందుకంటే ఎలాంటి తప్పులూ వాశళ్లు చేయలేదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. సరిగ్గా పంజాబ్ ఎన్నికల కంటే ముందు మా ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ను ఈడీ అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని మా వర్గాల ద్వారా సమాచారం అందింది. ఈడీని స్వాగతిస్తున్నాం. గతంలోనూ ఇలాగే చేశారు. కానీ వారికేమీ దొరకలేదు అని కేజ్రీవాల్ అన్నారు. ఎన్నికల్లో ఓడిపోతామని బీజేపీకి ఎప్పుడైతే తెలుస్తుందో, అప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రత్యర్థులపైకి తెస్తుందని, తాము మాత్రం దాడులకు భయపడే ప్రసక్తే లేదని కేజ్రీవాల్ ప్రకటించారు.