BRS Party Office| హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం నిర్మాణం పూర్తయింది. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం 1:05 గంటలకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. గురువారం మధ్యాహ్నం 12:30 గంటలకు వసంత్ విహార్లోని బీఆర్ఎస్ ఆఫీసుకు సీఎం చేరుకోనున్నారు. హోమం, యాగం, వాస్తు పూజల్లో కేసీఆర్ పాల్గొననున్నారు. అనంతరం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం బీఆర్ఎస్ కార్యాలయంలోనే పార్టీ నేతలు, కార్యకర్తలతో కేసీఆర్ గంట పాటు సమావేశం నిర్వహించనున్నారు.
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవ ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ కలిసి ప్రారంభోత్సవ ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఇప్పటికే మంత్రులు, బీఆర్ఎస్ నాయకులు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు ఢిల్లీకి చేరుకున్నారు.
కేసీఆర్ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇప్పటికే పార్టీ కార్యాలయాన్ని తమ ఆధీనంలో తీసుకున్న భద్రతా బలగాలు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
-11 వేల చదరపు అడుగుల స్థలంలో.. నాలుగు అంతస్తులతో నిర్మించారు.
-లోయర్ గ్రౌండ్లో మీడియా హాల్, సర్వెంట్ క్వార్టర్స్ ఏర్పాటు చేశారు.
-గ్రౌండ్ ఫ్లోర్లో క్యాంటీన్, రిసెప్షన్ లాబీ, 4 ప్రధాన కార్యదర్శుల ఛాంబర్లు ఏర్పాటు.
-మొదటి అంతస్తులో బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు కేసీఆర్ ఛాంబర్, ఇతర ఛాంబర్స్, కాన్ఫరెన్స్ హాల్ ఏర్పాటు.
-2, 3వ అంతస్తుల్లో మొత్తం 20 రూములు నిర్మించారు. వీటిలో ప్రెసిడెంట్ సూట్, వర్కింగ్ ప్రెసిడెంట్ సూట్ పోగా మిగతా 18 ఇతర రూములు అందుబాటులో ఉంటాయి.