రాంచీ : జార్ఖండ్ రాజధాని రాంచీలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా గిరిజన ఉద్యమకారుడు బిర్సా ముండా విగ్రహానికి సీఎం కేసీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. బిర్సా ముండా గిరిజన జాతికి, ఈ దేశానికి అందించిన సేవలను సీఎం కొనియాడారు. కేసీఆర్ వెంట ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు పలువురు నాయకులు ఉన్నారు. మరికాసేపట్లో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్తో కేసీఆర్ సమావేశం కానున్నారు.
గతేడాది గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు కేసీఆర్ ఆర్థిక సహాయం అందజేయనున్నారు. రాంచీలో జరిగే ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్తోపాటు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ కూడా పాల్గొననున్నారు. గల్వాన్లోయలో మరణించిన వీరజవాను కుందన్కుమార్ ఓఝా సతీమణి నమ్రత కుమారి, మరో వీరుడు గణేశ్ హన్సదా మాతృమూర్తి కప్రా హన్సదాలకు రూ.పది లక్షల చొప్పున చెక్కులను సీఎం కేసీఆర్ అందజేస్తారు.
జార్ఖండ్ ఖుంతీ జిల్లాలోని ఉలిహతు గ్రామంలో 1875, నవంబర్ 15న బిర్సాముండా ఆటవిక జాతుల కుటుంబంలో జన్మించారు. బిర్సాముండా ఆటవిక జాతుల స్వాతంత్ర్య సమరయోధుడు, జానపద నాయకుడు కూడా. ఇతను ముండా జాతికి చెందినవాడు. 19వ శతాబ్దపు చివరి రోజుల్లో, నేటి బీహార్, ఝార్ఖండ్ ఆటవిక ప్రాంతాల్లో, బ్రిటీష్ కాలంలో జరిగిన మిలీనేరియన్ ఉద్యమానికి సారథ్యం వహించాడు. తద్వారా భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిచిపోయాడు. ఇతడి గౌరవార్థం భారత పార్లమెంటులోని సెంట్రల్ హాల్లో ఈయన చిత్రపటం ఉంది. ఈ విధంగా సత్కరింపబడిన ఏకైక ఆటవిక జాతుల నాయకుడు బిర్సా ముండా. బ్రిటిష్ వలసవాదంపై తిరుగుబాటుగా సాగిన భారతీయ స్వాత్రంత్ర్య పోరాటంలో పాల్గొన్న యోధునిగా బిర్సా ముండా పేరును అత్యంత గౌరవంతో ప్రస్తావిస్తారు.