న్యూఢిల్లీ : ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్లోని బీఆర్ఎస్ కార్యాలయం ఆవరణలో రాజశ్యామల యాగం చివరి దశకు చేరుకుంది. రాజశ్యామల యాగం పూర్ణాహుతికి ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులకు వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్యాదవ్, కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామి, తమిళనాడుకు చెందిన విడుతలై చిరుతైగల్ కచ్చి పార్టీ ఎంపీ చిదంబరం, పలు రాష్ట్రాల రైతు సంఘం నాయకులు, ఎమ్మెల్సీ కవితతో పాటు బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
యాగం ముగిసిన వెంటనే బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని మధ్యాహ్నం 12:37 నుంచి 12:47 గంటల మధ్య సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. ఆ తర్వాత పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం కేసీఆర్ తన గదిలో ఆశీనులవుతారు. ఈ సందర్భంగా పార్టీలో పలువురు జాతీయ నాయకులు చేరే అవకాశం ఉంది.