ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పగ్గాలు రాహుల్ గాంధీయే చేపట్టాలని రాజస్థాన్ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాత్ అభిప్రాయపడ్డారు. గత మూడు దశాబ్దాలుగా గాంధీ కుటుంబం నుంచి ఎవ్వరూ ప్రధాని పదవిని కానీ, మంత్రి పదవులు కానీ అనుభవించలేదన్నారు. కాంగ్రెస్ ఐక్యతకు గాంధీ కుటుంబమే శరణ్యమని, దీనిని బట్టే పార్టీకి ఆ కుటుంబం ఎంత అవసరమో ద్యోతకమవుతోందని గెహ్లోత్ అన్నారు. 2017 లో పంజాబ్ కాంగ్రెస్ అంతా ఏకతాటిపై నడిచిందని, తాము గెలిచామని గుర్తు చేసుకున్నారు. చెన్నీ సీఎం అయిన తర్వాత కూడా పరిస్థితి తమకే అనుకూలంగా ఉండిందని, అయితే అంతర్గత కుమ్ములాటల వల్ల పంజాబ్లో ఓడిపోయామని వివరించారు.
సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్పై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందంటూ గెహ్లోత్ తీవ్రంగా ఆక్షేపించారు. కాంగ్రెస్ కేవలం ముస్లింల పక్షపాతి అని బీజేపీ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికల సందర్భంగా ధరల పెరుగుదల, నిరుద్యోగం లాంటి కీలక సమస్యలు వెనక్కి వెళ్లి, మతం ముందుకు వచ్చిందని గెహ్లోత్ అభిప్రాయపడ్డారు.